స్కూటీపై వెళుతున్న వివాహితకు నిప్పంటించిన అకతాయి... మంటల్లో కాలుతూనే...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన ఒకటి చోటుచేసుకుంది. స్కూటీపై వెళుతున్న ఓ వివాహితపై అకతాయి ఒకడు నిప్పంటించాడు. ఈ క్రమంలో బాధితురాలు మంటల్లో కాలుతూనే స్కూటీని నడుపుకుంటా ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ నుంచి మరో ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు, ఈ నెల 6వ తేదీన లక్నో సమీపంలో ఉన్న ఫరూఖాబాద్లో నిషా సింగ్ (33) అనే వివాహితను దీపక్ అనే వ్యక్తి గత రెండు నెలలుగా వేధింపులకు గురిచేస్తున్నాడు. తనతో మాట్లాడమంటూ ఆమెపై ఒత్తిడి తెస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల నిషా తన తండ్రి ఇంటికి వచ్చింది. అక్కడ నుంచి వైద్యుడు వద్దకు వెళ్లేందుకు ఆమె స్కూటీపై బయలుదేరంది.
దీన్ని గమనించిన దీపక్ ఆమె స్కూటీని అడ్డగించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో దీపక్, అతడి స్నేహితులు కలిసి నిషాకు నిప్పంటించారు. దీంతో ఆమె బిగ్గరగా కేకలు వేస్తూ స్కూటర్ నడుపుకుంటూ సమీపంలోని ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి, మరో ఆస్పత్రికి తరలిస్తుండగా నిషా ప్రాణాలు కోల్పోయింది.
బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. తన కుమార్తెకు నిప్పంటించింది దీపక్ అని, అతన్ని కఠినంగా శిక్షించాలని మృతురాలి తండ్రి డిమాండ్ చేస్తున్నాడు.