1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Anitha Reviews Security Arrangements for PM’s Visit

భోగాపురం ప్రారంభోత్సవం.. థింసా నృత్య ప్రదర్శనతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్

Bhogapuram
Bhogapuram
విశాఖపట్నంలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో భోగాపురం సందర్శించనున్న నేపథ్యంలో చేపట్టాల్సిన భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లపై హోం మంత్రి వంగలపూడి అనిత సమీక్షించారు. ఈ సమావేశానికి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీతో పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. 
 
ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించేందుకు పటిష్టమైన భద్రత, సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ, ప్రత్యామ్నాయ మార్గాలపై విస్తృత ప్రచారం కల్పించాలని ఆమె అధికారులను ఆదేశించారు. ప్రధాన మంత్రి పర్యటన సజావుగా, విజయవంతంగా సాగేలా చూసేందుకు వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరమని ఆమె పేర్కొన్నారు. 
 
మరోవైపు భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి కౌంట్‌డౌన్ మొదలైంది. మెగా గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం కానుంది. అదేరోజు మరో 17వేల 883 కోట్ల రూపాయల విలువైన ఇంధన, ఉపరితల రవాణా శాఖల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ ఈవెంట్‌ను ప్రజల పండుగలా నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం విమానాశ్రయ ప్రాధాన్యతను వివరిస్తూ ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు అనే ప్రత్యేక థీమ్‌తో రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పిస్తోంది.
 
ఇకపోతే.. ప్రధాని బహిరంగ సభను విజయవంతం చేసేలా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. మహానాడు లాంటి భారీ సభలు నిర్వహించిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ బాధ్యతలను నారా లోకేశ్‌ సారధ్యంలోని 13 కమిటీలకు అప్పగించారు. సభకు 3 లక్షల మంది జనం వస్తారన్న అంచనాలతో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా కూటమి ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
 
బహిరంగ సభకు మోదీ, చంద్రబాబు, పవన్ వచ్చే ఓపెన్ టాప్ రథాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. 13 వేల 500 మందికి పైగా గిరిజన మహిళలు, విద్యార్థులతో థింసా నృత్య ప్రదర్శన ద్వారా ప్రధానికి స్వాగతం పలకనున్నారు. తద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సృష్టించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
APSRTC: ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీఎస్ఆర్టీసీ నిరసనలు