సంబంధిత వార్తలు
- నీట్-యూజీ 2026: జూన్ 21న మళ్లీ పరీక్ష.. ఎన్టీఏ ప్రకటన
- సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు వెల్లడి... బాలికలదే పైచేయి
- National Girl Child Day 2026: బాలికల కోసం సంక్షేమ పథకాలు.. అవేంటో తెలుసా?
- విజయ్ వీరాభిమానిని - ఆ సినిమాకు జరిగినట్టు మరో చిత్రానికి జరగరాదు : సుధా కొంగరా
- సీబీఎస్ఈ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు - వచ్చే యేడాది రెండుసార్లు..
ఇకపై... సీబీఎస్ఈ విద్యలో త్రిభాషా విధానం తప్పనిసరి...
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ విద్యా విధానంలో త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేసింది. ఇక నుంచి తొమ్మిది, పదో తరగతి విద్యార్థులు విధిగా త్రిభాషా విధానాన్ని పాటించాలని సూచించింది. వచ్చే జులై ఒకటి నుంచి ఇది అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఈ మేరకు సీబీఎస్ఈ ఒక సర్క్యులర్ను జారీ చేసింది.
దీని ప్రకారం... ఆ మూడు భాషల్లో రెండు భారతీయ భాషలు ఉండాలి. మూడు భాషలను అధ్యయనం చేయాలి. ఇక పదో తరగతి విద్యార్థులకు ఒక ఊరట కల్పించింది. మూడో భాషకు బోర్డ్ ఎగ్జామ్ ఉండదని వెల్లడించింది. వారు భాషాధ్యయనంపైనే దృష్టి సారించేలా.. అనవసర ఒత్తిడి తగ్గించేందుకే ఈ ఏర్పాటు అని బోర్డ్ పేర్కొంది. ఆ పాఠ్యాంశానికి పాఠశాలల్లో చూపే ప్రతిభ ఆధారంగానే మార్కులు కేటాయిస్తారు.
జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)లో ఈ త్రిభాషా విధానం భాగం. విద్యార్థులు మూడు భాషలు నేర్చుకోవాలని ఎన్ఈపీ-2020 సిఫార్సు చేస్తోంది. ఇందులో ఖచ్చితంగా రెండు భారతీయ భాషలుండాలి. ఈ ఫార్ములా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలన్నింటికీ వర్తిస్తుంది. అయితే విద్యార్థులకు నేర్పాల్సిన భాషలేమిటన్నది నిర్ణయించుకునే అధికారం రాష్ట్రాలదే.
విద్యార్థులు మాధ్యమిక పాఠశాల స్థాయిలో భారతీయ భాషలు, ఆంగ్లంతోపాటు కొరియన్, జపనీస్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ భాషలూ అభ్యసించవచ్చని ఎన్ఈపీ-2020 చెబుతోంది. అధిక శాతం పాఠశాలల్లో భాషా మాధ్యమంగా ఉన్న ఆంగ్లాన్ని విదేశీ భాషగా పరిగణిస్తారు. అందుకే ఈ భాషను ఎంచుకునే విద్యార్థులు రెండు భారతీయ భాషలను ఎంచుకోవాల్సి ఉంటుంది. రాజ్యాంగ నిర్దేశాలను, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతోపాటు బహుభాషా తత్వాన్ని ప్రోత్సహించి జాతీయ సమైక్యతను సాధించేందుకే ఈ విధానామని ఎన్ఈపీ నిబంధనలు చెప్తున్నాయి.
