అమెరికా కలలు, వాస్తవాలపై నాట్స్ అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా అమెరికా కలలు, వాస్తవాలు అనే శీర్షికతో నిర్వహించిన ఆన్లైన్ అవగాహన సదస్సుకు మంచి స్పందన లభించింది. ప్రముఖ ఎమోషనల్ ఇంటిలెజెన్స్ కోచ్ భారతీ నాదెండ్ల ఈ సదస్సుకు విచ్చేసి ఎన్నో అమూల్యమైన విషయాలను తెలుగు వారికి తెలిపారు. అమెరికాలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరి మనసులో ఎన్నో ఉన్నతమైన కలలు ఉంటాయని, అయితే అక్కడి పరిస్థితులు, జీవన శైలి, వృత్తిపరమైన ఒత్తిళ్లు పూర్తిగా భిన్నంగా ఉంటాయని భారతీ నాదెండ్ల విశ్లేషించారు.
పైకి కనిపించే మెరిసే జీవితం వెనుక ఎంతో కఠినమైన శ్రమ, సవాళ్లు ఉంటాయని యువత గ్రహించాలని ఈ సదస్సులో ఆమె సూచించారు. చదువు కోసం, ఉద్యోగాల కోసం అమెరికాకు వస్తున్న విద్యార్థులు ఆర్థిక సర్దుబాట్లు, ఒంటరితనం, కొత్త సంస్కృతికి అలవాటు పడటంలో ఎదురయ్యే ఇబ్బందులను భారతీ ప్రస్తావించారు. సరైన అవగాహన లేకపోతే చిన్న సమస్యలు కూడా మానసిక ఆందోళనకు దారితీస్తాయని, ముందస్తు మానసిక సిద్ధత ఎంతో అవసరమని చెప్పారు.. అమెరికాలో వివాహాలు, సంబంధాల విషయంలో యువత వారి కుటుంబాల అంచనాలు వాస్తవ రూపం దాల్చేటప్పుడు కొన్నిసార్లు పొరపడే అవకాశం ఉందని హెచ్చరించారు.. ముఖ్యంగా మారుతున్న కాలానికి అనుగుణంగా అమెరికా జీవన విధానాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలని భారతీ సూచించారు.
ఆద్యంతం ఎంతో ఉపయుక్తంగా ఈ అవగాహన సదస్సు జరిగింది. నాట్స్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ రాజ్యలక్ష్మి చిలుకూరి ఈ సదస్సుకు అనుసంధానకర్తగా వ్యవహరించారు. . అమెరికాలో గృహహింస, కుటుంబ వివాదాల బారిన పడుతున్న వారికి నాట్స్ ఏ విధంగా అండగా నిలుస్తుందనేది రాజ్యలక్ష్మి చిలుకూరి వివరించారు. అమెరికా జీవితం గురించి ఎన్నో ఆశలతో వచ్చే మహిళలు వాస్తవంగా ఎదుర్కొంటున్న పరిస్థితులను, వారి భద్రత కోసం నాట్స్ తీసుకుంటున్న చర్యలను ఆమె తెలిపారు. నాట్స్ హెల్ప్లైన్ ద్వారా అందిస్తున్న సేవలను వివరించారు.
ఇలాంటి వెబినార్ల ద్వారా విదేశాలకు వచ్చే తెలుగు యువతకు, విద్యార్థులకు వాస్తవ పరిస్థితులపై ముందే ఒక స్పష్టత వస్తుందని, తద్వారా వారు ఎలాంటి తప్పు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి సహాయపడుతుందని ఈ సదస్సులో పాల్గొన్న తెలుగు వారు తెలిపారు. ఈ సదస్సు విజయవంతం చేయడంలో నాట్స్ నుంచి మురళి, రాజేష్, కిషోర్, అశ్వదీప్తి తదితరులు కీలక పాత్ర పోషించారు. అమెరికా కలలపై అసలు వాస్తవాలను తెలుగువారికి చేరువ చేయడానికి కృషి చేసిన నాట్స్ టీం సభ్యులను నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ ప్రత్యేకంగా అభినందించారు.
