నేపాల్ వరద విపత్తు - తెలంగాణ వాళ్లు 22 మంది మిస్సింగ్ - 18 మంది ఎన్ఆర్ఐలు..
నేపాల్ దేశంలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా తెలంగాణాకు చెందిన 22 మంది ఆచూకీ తెలియకుండా పోయిందని కేంద్ర అధికార వర్గాలు వెల్లడించాయి. వీరిలో 18 మంది తెలంగాణా మూలాలు ఉన్న ప్రవాస భారతీయులు ఉన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్కు అందిన సమాచారం మేరకు.. బాధిత కుటుంబాలు, ఇతరుల నుంచి 80 నుంచి 100 ఫోన్ కాల్స్ వచ్చాయి.
ఆచూకీ గల్లంతైన 22 మందిలో 20 కేసులను అధికారులు గుర్తంచారు. వీరిలో ఆరుగురు తెలంగాణాకు చెందిన వారు కాగా, మరో 17 మంది తెలంగాణా మూలాలు ఉన్న ప్రవాస భారతీయులని తెలిసింది. వారి ఆచూకీ కనుగొనేందుకు చర్యలు చేపట్టినట్టు తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
మరోవైపు, నేపాల్ వరద విపత్తులో చిక్కుకున్న డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి, ఆయన సతీమణితో పాటు సురక్షితంగా ఉన్నట్టు సమాచారం. మానస సరోవర్ యాత్రకు వెళ్లిన ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందిన కందిమళ్ల సుహాసిని రెడ్డి ఆచూకీ తెలియరాలేదని తండ్రి మహేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
