మంత్రి పదవి పోయినందుకు బాధలేదు.. కానీ అకారణంగా తొలగించడం బాధగా ఉంది : కొండా సురేఖ
మంత్రి పదవి పోయినందుకు తనకు ఎలాంటి బాధ లేదని, కానీ, తాను ఎలాంటి తప్పు చేయకపోయినా అకారణంగా తొలగించడం బాధ కలిగిస్తోదని ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. పదవులు ముఖ్యంకాదని ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోవడమే తన లక్ష్యమన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గం నుంచి కొండా సురేఖను ఇటీవల బర్తరఫ్ చేయించారు. ఆ తర్వాత కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్ కార్యకర్తలతో తొలిసారిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ.. ప్రస్తుతం అవకాశవాద రాజకీయాలు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
'ఎంపీపీ నుంచి మంత్రి స్థాయి వరకు వచ్చాను. కొందరు ఉదయం ఒక పార్టీలో ఉండి.. మధ్యాహ్నం మరో పార్టీలోకి వెళ్తున్నారు. మేం నమ్మిన రాజశేఖర్ రెడ్డి కోసం గతంలో మంత్రి పదవికి రాజీనామా చేశా. కొందరు వార్డు మెంబర్గా కూడా రాజీనామా చేయరన్నారు.
గతంలో కొందరు గుంటనక్కలు మాకు టికెట్ రాకుండా చేశారు. కాంగ్రెస్లో టికెట్ రాకపోతే.. కేసీఆర్ పిలిచి వరంగల్ ఈస్ట్ టికెట్ ఇచ్చారు. కేసీఆర్ టికెట్ ఇచ్చినందుకు నాడు మంత్రిగా ఉన్న వ్యక్తిని ఓడించాం. వరంగల్ ఈస్ట్లో మేం గెలిచినందునే ప్రజలు ప్రశాంత జీవితం గడిపారు. కొండా మురళి ఉన్నారనే ధైర్యంతో ఉండేవారన్నారు.
తనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత అల్లర్లు చేయాలా అని కొందరు మాకు ఫోన్ చేశారు. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని వారికి చెప్పాను. నా నిర్ణయానికి కట్టుబడి ఉన్నందుకు కార్యకర్తలకు ధన్యవాదాలు. పదవులు ఇవాళ ఉంటాయి.. రేపు పోతాయి. పదవులు కాదు ప్రజల్లో చిరస్థాయిగా ఉండటమే మా లక్ష్యమన్నారు.
సీఎం రేవంత్రెడ్డి రైతుల కోసం పాదయాత్ర చేశారు. రేవంతన్నా.. నీలాంటి మాస్ లీడర్ కాంగ్రెస్కు అవసరమని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. అదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. నాకు మంత్రి పదవి వచ్చింది. పదవి అనేది అలంకారమే.. పదవి లేకున్నా పనులు చేయొచ్చు. మంత్రి పదవి పోయిందని ఇంట్లో కూర్చోం. ప్రజల్లోనే ఉంటాం. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని సీట్లూ గెలుస్తాం అని సురేఖ ప్రకటించారు.

