కొండా సురేఖకు షాకివ్వనున్న కుమార్తె సుస్మిత - జనసేనలోని జంప్?
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు ఆమె కుమార్తె కొండా సుస్మిత తేరుకోలేని షాకివ్వనున్నారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో కొండా సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించిన విషయం తెల్సిందే. ఈ వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ ఖండించకపోగా, ఆ వ్యాఖ్యలు సుస్మిత వ్యక్తిగతమని, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో టీ పీసీసీ క్రమశిక్షణా కమిటి కొండా సురేఖకు షోకాజా నోటీసు జారీ చేసి, వివరణ తీసుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించవచ్చనే ప్రచారం జోరుగాసాగుతోంది.
ఈ నేపథ్యంలో కొండా సుస్మిత జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత వివాదాల నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారని, జనసేన నేతలతో చర్చలు కూడా జరుగుతున్నాయని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇటీవలికాలంలో కొండా ఫ్యామిలీకి, కాంగ్రెస్ అధిష్టానానికి మధ్య దూరం పెరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పరకాల అసెంబ్లీ టికెట్ను ఆశిస్తున్న సుస్మిత, తనకు అవకాశం ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ప్రకటించారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డిపై ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారం రేపాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. దీనిపై ఆమె పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి వివరణ ఇచ్చినట్లు సమాచారం.
ఇలాంటి తరుణంలోనే సుస్మిత జనసేన వైపు చూస్తున్నారని, ఆ పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో పార్టీని విస్తరించే పనిలో ఉన్న జనసేన, ఆమె చేరికకు సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా వైద్యారోగ్య శాఖ మాజీ డైరెక్టర్ గడల శ్రీనివాస్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం ఆ పార్టీ విస్తరణ వ్యూహాలకు బలం చేకూరుస్తోంది.
అయితే, ఈ ప్రచారంపై కొండా సుస్మిత వైపు నుంచి గానీ, జనసేన పార్టీ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వివాదం ముదురుతున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ ప్రచారం రాజకీయంగా తీవ్ర ఆసక్తిని రేపుతోంది.
