ఖైరతాబాద్లో కొలువైన పంచముఖ సంకటహర మహాగణపతి
వినాయక చవితి వేడుకలకు హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ గణేశుడు ముస్తాబయ్యాడు. ఈ దఫా పంచముఖ సంకటహర మహాగణపతిగా భక్తులకు అభయమివ్వనున్నాడు. చవితి వేడుకల్లో భాగంగా, సోమవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతుల చేతుల మీదుగా తొలిపూజ జరుగనుంది.
కాగా, గణేశ్, నవరాత్రి ఉత్సవాల సందర్బంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాయింట్ కమిషనర్ ట్రాఫిక్ విభాగంగా జోయల్ డేవిస్ కీలక ఆంక్షలు ప్రకటించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 12వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో వాహనాలరాకపోకలపై ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు.
మరోవైపు, నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ గార్డెన్ వైపు నుంచి వచ్చే భక్తుల వాహనాలను రేస్ కోర్సు రోడ్, ఎన్టీఆర్ ఘాట్, ఐమ్యాక్స్ థియేటర్ పక్కన ఉన్న హెచ్ఎండీఏ పార్కింగ్ స్థలంతో పాటు ఐమ్యాక్స్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పార్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఖైరతాబాద్ జంక్షన్ వైపు నుంచి వచ్చే వాహనాలను విశ్వేశ్వరయ్య భవన్ ప్రాంగణంలో పార్కింగ్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. గణేశ్ నిమజ్జన ఉత్సవాలు పూర్తయ్యే వరకు వాహనదారులు, భక్తులు ఈ ఆంక్షలకు సహకరించాలని కోరారు.

