బుధవారం, 30 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 ఏప్రియల్ 2025 (07:28 IST)

అప్పన్న స్వామి ఆలయంలో అపశ్రుతి.. గోడకూలి ఎనిమిది మంది భక్తులు మృతి (video)

Simhachalam
Simhachalam
విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. అప్పన్న స్వామి వారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, నలుగురికి గాయాలైనాయి. మృతులలో ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు వున్నారు. 
 
మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురవడంతో సింహగిరి బస్తాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలోని షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలైన్‌పై సిమెంట్ గోడ కూలిపోయింది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారిక సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు. 
 
అక్షయ తృతీయ రోజున వరాహా లక్ష్మీ నరసింహ స్వామి భక్తులకు నిజరూపంలో దర్శనమిస్తున్న వేళ ఇలాంటి అపశ్రుతి చోటుచేసుకోవడంపై భక్తులు మండిపడుతున్నారు. ఆలయ నిర్వాకం భక్తుల భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు మండిపడుతున్నారు. స్వామిపై వున్న చందనాన్ని వెండి బొరిగెలతో సున్నితంగా తొలగించి.. అప్పన్న స్వామి నిజరూప దర్శనానికి భక్తులను అనుమతించారు.