కర్నూలు బస్సు అగ్నిప్రమాదంలో ఇద్దరు టెక్కీలు మృతి
ఏపీలోని కర్నూలులో హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళుతున్న వేమూరి కావేరి ట్రెవెల్ బస్సు అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారిలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఉన్నారు. వీరిని ఏపీలోని బాపట్ల జిల్లా యద్ధనపూడి మండలం పూసపాడుకు చెందిన గన్నమనేని ధాత్రి (27), తెలంగాణలోని యాదాద్రి జిల్లా గుండాల మండలం వస్తకొండూరుకు చెందిన అనూష రెడ్డిగా గుర్తించారు. వీరిద్దరూ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు.
ధాత్రి ఇటీవల హైదరాబాద్లోని మేనమామ ఇంటికి వచ్చారు. అక్కడి నుంచి బెంగళూరు వెళ్లేందుకు గురువారం రాత్రి వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అదే బస్సులో అనూష రెడ్డి కూడా వెళ్లారు. దీపావళికి స్వగ్రామానికి వచ్చిన ఆమె గురువారం రాత్రి బెంగళూరుకు బయల్దేరారు.
ఖైరతాబాద్లో అనూషరెడ్డి బస్సు ఎక్కి ఈ దుర్ఘటనలో మృతిచెందారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ల మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అనూష మృతితో ఆమె తల్లిదండ్రులు కన్నీమున్నీరవుతున్నారు. బస్సు ప్రమాదంలో మృతిచెందిన మరికొందరిని గుర్తించాల్సి ఉంది.
మరోవైపు, ఏపీలోని కర్నూలు శివారులో జరిగిన బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ప్రమాదంలో చనిపోయిన తెలంగాణ పౌరుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల ఆర్థికసాయం అందిస్తామని వెల్లడించింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని ఆ రాష్ట్ర రవాణా శాఖామంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.