తమ కుటుంబ సభ్యులు ఎవరూ రాజకీయాల్లోకి రారు : వెంకయ్య నాయుడు
ప్రస్తుతం తాను రాజకీయాల్లో లేనని, అలాగే, తమ కుటుంబ సభ్యులు ఎవరూ రాజకీయాల్లోకి రారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. నేటి పరిస్థితుల్లో తమ కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రావాలని తాను కోరుకోవడం లేదని ఆయన అన్నారు.
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని కొత్తపల్లి శ్రీరాములు కనకమ్మ లయన్ ఆడిటోరియంలో ఇమ్మణి వెంకట్, దీపల కుమారుడు, తన మనువడు విష్ణు వివాహ రిసెప్షన్ వేడుకల్లో వెంకయ్య నాయుడు తన సతీమణి ఉషతో కలిసి పాల్గొన్నారు. ఇందుకోసం ఆయన విశాఖపట్టణం నుంచి రాజమండ్రికి వందే భారత్ రైలులో చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో నిడదవోలుకు చేరుకున్నారు.
తన వియ్యంకుడు విష్ణురావు స్వగ్రామ నిడదవోలు కావడంతో వివాహ రిసెప్షన్ను అక్కడ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను భవిష్యత్లోనూ కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, అచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు బూరుగుపల్లి శేషారావు, శ్రీనివాస నాయుడు తదితరులు పాల్గొన్నారు.