నరసాపూర్ - చెన్నై ప్రాంతాల మధ్య మరో వందే భారత్ రైలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో వందే భారత్ రైలు రానుంది. ఈ విషయాన్ని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ వెల్లడించారు. ఈ రైలు నరసాపురం - చెన్నై ప్రాంతాల మధ్య నడుపుతామని తెలిపారు. అలాగే, నరసాపురం - అరుణాచలం (తిరువణ్ణామలై) ఎక్స్ ప్రెస్ రైలు సేవలను కూడా క్రమబద్ధీకరించనున్నట్టు ఆయన తెలిపారు. అలాగే, తన పార్లమెంట్ నియోజకవర్గమైన నరసాపురం అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఆయన తెలిపారు.
రూ.3200 కోట్ల అంచనా వ్యయంతో 165వ జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి డీపీఆర్ సిద్ధమైందని వెల్లడించారు. పరిపాలన సౌలభ్యం కోసం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట ఉండేలా కొత్త కలెక్టరేట్ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో రైల్వే, జాతీయ రహదారుల ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిసారించినట్టు ఆయన వెల్లడించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ను నష్టాల బారి నుంచి లాభాల బాట పట్టించేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నామని, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేట్ పరం కాదని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారంటూ బాధ్యతారహిత పార్టీల నాయకులు అర్థంలేని ఆరోపణలు మానుకోవాలన్నారు. కేంద్రం రూ.11,500 కోట్లు ఇచ్చింది నష్టాల్లో ఉన్న ప్లాంట్ను కాపాడేందుకే. స్టీల్ ప్లాంట్ భవిష్యత్ ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలకు అందరూ సహకరించాలి. ఉక్కు పరిశ్రమ భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేదన్నారు.
కార్మికులు, ట్రేడ్ యూనియన్ నాయకుల సహకారంతో ప్లాంట్ను లాభాల బాట పట్టిస్తాం. పరిశ్రమ ప్రయోజనాల కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవు. జీఎస్టీ తగ్గిస్తూ తీసుకున్న సాహసోపేత నిర్ణయంతో విప్లవాత్మక మార్పులు వస్తాయి. సాధారణ ప్రజల జీవన స్థితిగతుల్లో సమూల మార్పులు రానున్నాయి.
రెండు స్లాబ్లతో రానున్న రోజుల్లో మరింత వెసులుబాటు కలగనుంది. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో రైల్వేలు, జాతీయరహదారులపై ప్రత్యేక దృష్టి సారించాం. 165వ జాతీయ రహదారి విస్తరణకు రూ.3,200 కోట్లతో డీపీఆర్ సిద్ధమైంది. త్వరలో నరసాపురం - చెన్నై వందే భారత్ రైలు ప్రారంభం కానుంది. నరసాపురం - అరుణాచలం ఎక్స్ప్రెస్ను రెగ్యులరైజ్ చేస్తాం. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట ఉండేలా కలెక్టరేట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని శ్రీనివాసవర్మ తెలిపారు.