మోసం చేయడమంటే ఇదేనేమో ... కూటమి సర్కారుపై వైఎస్.షర్మిల ధ్వజం
అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీలకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇపుడు వారికి తీరని అన్యాయం చేస్తుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో అంగన్వాడీలు ఆందోళన బాటపడుతుండటంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మాట ఇచ్చి మోసం చేయడం అంటే ఇదేనేనని, తమ గోడు వినిపించాలనుకున్న అంగన్వాడీలను ఎక్కడికక్కడ నిర్బంధించడం నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. వారి గొంతు నొక్కి, ఆందోళనలను అణిచివేయడం కూటమి ప్రభుత్వ నియంతృత్వ చేష్టలకు పరాకాష్ట అని పేర్కొన్నారు. అంగన్వాడీల డిమాండ్లు పూర్తిగా న్యాయబద్ధమైనవని, వారిని వెంటనే చర్చలకు ఆహ్వానించి వారి కోర్కెలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.
ముఖ్యంగా, అంగన్వాడీ ప్రధాన డిమాండ్లు అయిన నెలకు గౌరవ వేతనంగా రూ.26 వేలు ఇవ్వాలని, గ్రాట్యుటీ చెల్లింపు హామీని అమలు చేయాలని, మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, హెల్పర్ల పదోన్నతిపై నిర్ధిష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని, పెండింగ్ పోస్టులను భర్తీ చేయాలని, విధి నిర్వహణలో అంగన్వాడీలు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగంతో పాటు అంత్యక్రియల కోసం రూ.20 వేలు ఇవ్వాలని, వీటితో పాటు మరో 12 డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు.