శుక్రవారం, 10 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 అక్టోబరు 2025 (09:05 IST)

ప్రేమ పేరుతో ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం.. ఎక్కడ?

Kochi toddler murder case
ప్రేమ పేరుతో ఇంటర్ విద్యార్థిని నమ్మించి అత్యాచారం చేశారు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ బాలిక అపస్మారకస్థితిలోకి జారుకుని ప్రాణాలు విడిచింది. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడితో పాటు అతడికి సహకరించిన స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
పోలీసుల కథనం ప్రకారం నల్గొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని రోజూ ఆటోలో కాలేజీకి వెళ్లేది. అదే గ్రామంలో మూడు నెలల క్రితం ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేసిన గడ్డం కృష్ణ అనే యువకుడు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా నిత్యం చాటింగ్ చేస్తూ, ప్రేమ పేరుతో ఆమెను తన దారికి తెచ్చుకున్నాడు. 
 
ఈ క్రమంలో ఈ నెల 7వ తేదీన బాలిక రోజూలాగే ఆటోలో కాలేజీకి బయలుదేరింది. ఉదయం 8:30 గంటల సమయంలో డీఈవో ఆఫీసు చౌరస్తా వద్దకు ఆటో చేరుకోగానే పథకం ప్రకారం బైకుపై అక్కడ వేచి ఉన్న కృష్ణ ఆమెను ఆటో నుంచి దింపాడు. తన బైకుపై తీసుకెళ్తే గ్రామస్థులు ఎవరైనా గుర్తుపడతారనే ఉద్దేశంతో తన స్నేహితుడైన ఆటో డ్రైవర్ బచ్చలకూరి మధు వాహనంలో బాలికను ఎక్కించాడు. మధు ఆమెను షంషూ నగరులోని కృష్ణ అద్దెకు ఉంటున్న గది వద్దకు తీసుకెళ్లాడు.
 
అనంతరం కృష్ణ ఆ గదికి చేరుకుని బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో తీవ్ర రక్తస్రావం కావడంతో విద్యార్థిని అపస్మారక స్థితిలోకి వెళ్లి, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. భయపడిపోయిన కృష్ణ, గదికి తాళం వేసి పరారయ్యాడు. జరిగిన విషయాన్ని అతడు ఓ తెలిసిన వ్యక్తికి చెప్పడంతో ఈ సమాచారం బాలిక తల్లిదండ్రులకు, పోలీసులకు చేరింది. 
 
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అదే రోజు సాయంత్రం కృష్ణ పోలీసులకు లొంగిపోగా, అతడి స్నేహితుడు మధును కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.