ఫోన్ చోరీ చేసిందని అట్లకాడ కాల్చి వాతపెట్టారు...
ఫోన్ దొంగిలించిందన్న నెపంతో ఓ చిన్నారిని చిత్రహింసలకు గురిచేశారు. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి... అట్లకాడ కాల్చి చిన్నారికి వాతలు పెట్టారు. తనకు తెలియదని మొత్తుకున్నప్పటికీ ఏమాత్రం వినకుండా చిత్రహింసలకు గురిచేశారు. ఈ అమానుష ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కుడితిపాళెం గ్రామం కాకర్లదిబ్బలో జరిగింది.
పోలీసుల కథనం మేరకు... పదేళ్ల చిన్నారికి తల్లిదండ్రులు లేకపోవడంతో ఆమె మేనత్త మాణికల మన్నారి తీసుకొచ్చి పెంచుకుంటుందోంది. ఆ బాలిక పొరిగింట్లో ఉన్న నాగరాజు అనే వ్యక్తి ఫోన్ శనివారం పోయింది. దీంతో ఆయన జ్యోతిష్యుడి వద్దకు వెళ్ళగా పక్కింటిలో ఉన్న చిన్నారి చోరీ చేసిందని చెప్పాడు.
వెంటనే నాగరాజు ఆయన భార్య సుబ్బమ్మ, చుట్టుపక్కలవారైన శ్రీనివాసులు, సార్ముడమ్మ, మన్నారిలు అనుమానంతో ఆ బాలికను లాక్కెళ్లి పొయ్యివద్ద పడకోబెట్టి, అట్లకాడ కాల్చి వాతలుపెట్టారు. మూతి, నాలుకు, చేతులపై ఈ వాతలు పెట్టారు. ఆదివారం స్థానికులు గమనించి 112 ఫోన్ చేసి చెప్పడంతో ఎస్ఐ నాగార్జున రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించాడు. చిన్నారిని చిత్రహింసలకు గురిచేసినందుకు కేసు నమోదు చేసి మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.