అప్పుల బాధ భరించలేక భర్తను చంపి భార్య ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ జంట అప్పుల బాధ భరించలేక దారుణం నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ కలిసి చనిపోవాలని నిశ్చయించుకున్నారు. ఇంట్లో కూరగాయలు తరిగే కత్తితో భర్త గొంతు కోసి చంపేసిన భార్య.. ఆ తర్వాత అదే కత్తితో తన కూడా గొంతుకోసుకుంది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్బీలో చోటుచేసుకుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... కేపీహెచ్బీలో నివాసం ఉంటున్న భార్యాభర్తలు రామకృష్ణ, రమ్యకృష్ణలు అప్పుల పాలయ్యారు. ఇటీవల అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి తీవ్రమైంది. పైగా, అప్పు తిరిగి చెల్లించే మార్గం లేకపోవడంతో భార్యాభార్తలు కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు.
దీంతో తమ ఇంట్లోనే వారు ఆత్మహత్య ప్రయత్నించారు. తొలుత భర్త కొంతు కోసి చంపిన రమ్యకృష్ణ.. ఆ తర్వాత అదే కత్తితో తన గొంతుకోసుకుంది. చుట్టుపక్కుల వారు దీన్ని గమనించి ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే రామకృష్ణ చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు.
రమ్యకృష్ణను ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటం అధికంగా రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.