సోమవారం, 1 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఫ్లాష్ బ్యాక్ 2021
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 నవంబరు 2025 (20:10 IST)

యూపీలో దారుణం : అనుమానాస్పదంగా నేవీ అధికారి భార్య మృతి

deadbody
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భారత నేవీ అధికారి భార్య రైలు ప్రయాణంలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. టికెట్ విషయంలో వాగ్వాదం జరిగిన తర్వాత, ట్రైన్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ) ఆమె లగేజీని బయటకు విసిరి, ఆమెను కూడా రైలు నుంచి తోసేశారని సహ ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు టీటీఈపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
 
వివరాల్లోకి వెళితే, కాన్పూర్‌కు చెందిన అర్తి యాదవ్ (30) నవంబరు 26వ తేదీన ఢిల్లీ వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు వచ్చారు. ఆమె ఎక్కాల్సిన రైలు 10 గంటలు ఆలస్యం కావడంతో, పొరపాటున పాట్నా - ఆనంద్ విహార్ ప్రత్యేక రైలు ఎక్కారు. ఈ క్రమంలో ఎస్-11 కోచ్ టీటీఈ సంతోష్ కుమార్‌కు, ఆమెకు మధ్య టికెట్‌పై వాగ్వాదం జరిగింది. టీటీఈ మొదట ఆమె లగేజీని రైలు నుంచి విసిరేశారని, ఆ తర్వాత ఆమెను కూడా తోసివేశారని తోటి ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
 
ఏటవా జిల్లాలోని సమ్హాన్ - భర్తనా స్టేషన్ల మధ్య రైలు ట్రాక్‌పై అర్తి మృతదేహాన్ని గుర్తించారు. ఆమె లగేజీ ఘటనా స్థలానికి 4 కిలోమీటర్ల దూరంలో లభ్యమైంది. ఇది ఖచ్చితంగా హత్యేనని అర్తి తండ్రి అనిల్ కుమార్ ఆరోపిస్తున్నారు. 'ఘటన జరిగిన తర్వాత టీటీఈ రైలును ఆపకుండా, చైన్ లాగకుండా 30 కిలోమీటర్ల దూరంలోని ఏటవా జంక్షన్ వరకు ఎలా వెళ్లారు?' అని ఆయన ప్రశ్నించారు.
 
మృతురాలు అర్తి యాదవు 2020లో నేవీ చీఫ్ పెట్టీ ఆఫీసర్ అజయ్ యాదవ్‌తో వివాహమైంది. అజయ్ ముంబైలో పనిచేస్తుండగా, అర్తి ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం వెళుతుండగా ఈ ఘోరం జరిగింది. ఘటన జరిగినప్పుడు అజయ్ చెన్నైలో శిక్షణలో ఉన్నారు.
 
ఏటవా జీఆర్పీ పోలీసులు టీటీఈ సంతోష్ కుమా‌ర్‌పై కల్పబుల్ హోమిసైడ్ (హత్యగా పరిగణించరాని నేరం) కింద కేసు నమోదు చేశారు. అయితే, ప్రాథమికంగా ఆమె రైలు నుంచి దూకినట్లు కనిపిస్తోందని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సర్కిల్ ఆఫీసర్ ఉదయ్ ప్రతాప్ సింగ్ తెలిపారు. టీటీఈని ఇంకా అరెస్టు చేయలేదని, ఆయన విధుల్లోనే ఉన్నారని సమాచారం. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని రైల్వే అధికారులు సైతం ధృవీకరించారు.