మళ్ళీ పంజా విసురుతున్న కరోనా వైరస్.. ఆ రెండు దేశాల్లో కొత్త కేసుల నమోదు!!
ఆసియా దేశాల్లో మళ్లీ కోవిడ్ అలజడి మొదలైంది. పలు దేశాల్లో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. హాంకాంగ్లో యేడాది గరిష్టానికి కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు సింగపూర్లో కూడా భారీగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రజల్లో రోగనిరోధక శక్తి తగ్గడమే కొత్త కేసుల నమోదుకు కారణమని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
హాంకాంగ్లో ప్రస్తుతం వైరస్ కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయని నగర ఆరోగ్య పరిరక్షణ కేంద్రంలోని అంటు వ్యాధుల విభాగం అధిపతి అల్బర్ట్ స్థానిక మీడియాకు తెలిపారు. ఇటీవలికాలంలో హాంకాంగ్లో శ్వాసకోశ నమూనాల్లో కోవిడ్ పాజిటివ్గా తేలుతున్న వారి శాతం గత యేడాది ఇదే సమయంతో పోలిస్తే అత్యధిక స్థాయికి చేరింది.
మే 3వ తేదీతో ముగిసిన వారాంతంలో తీవ్రమైన కేసులు, మరణాలు కూడా దాదాపు యేడాది గరిష్ట స్థాయికి చేరి 31గా నమోదయ్యాయని సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత రెండేళ్లలో చూసినంత తీవ్రస్థాయిలో ప్రస్తుత వ్యాప్తి లేనప్పటికీ చేరికలు వంటివి 70 లక్షలకు పైగా జనాభాలో ఉన్న నగరంలో వైరస్ చురుకుగా వ్యాపిస్తోంది నిపుణులు అంటున్నారు.
అలాగే ఆసియా ఆర్థిక కేంద్రంగా ఉన్న సింగపూర్ కూడా కోవిడ్ విషయంలో అప్రమత్తమైంది. నగర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దాదాపు యేడాది తర్వాత ఈ నెలలో తొలిసారిగ ఇన్ఫెక్షన్ల సంఖ్యపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. మే 3వ తేదీతో ముగిసిన వారంలో అంతకుముందు ఏడు రోజులతో పోలిస్తే కేసుల సంఖ్య 28 శాతం పెరిగి 14200కు చేరింది. రోజువారీ ఆస్పత్రి చేరికలు కూడా సుమారు 30 శాతం పెరిగాయి. సాధారణంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగినపుడు మాత్రమే సింగపూర్ ఆరోగ్య శాఖ వివరాలను వెల్లడిస్తుంది.