భారత్పై పాకిస్థాన్ ఎపుడు అణుదాడి చేస్తుంది? రక్షణ రంగ నిపుణులేమంటున్నారు?
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు దేశాల సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ బలగాలు కాల్పుల మోత మోగిస్తుంటే, వీటిని భారత బలగాలు ధీటుగా తిప్పికొడుతున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పాకిస్థాన్పై భారత్ యుద్ధం ప్రకటిస్తే, పాకిస్థాన్ అణ్వాయుధంతో దాడి చేస్తుందా లేదా అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే, భారత్పై అణు దాడి చేయాలంటే పాకిస్థాన్ను అన్ని విధాలుగా దిగ్బంధించాల్సి వుంటుందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా నాలుగు అంశాల్లో పాకిస్థాన్ చిక్కుకుంటే అణుదాడి చేసే అవకాశం ఉందని వారు అంటున్నారు.
మొదటిది భారత సైన్యం పెద్ద ఎత్తున పాక్ భూభాగంలోకి ప్రవేశించి ముందుకు దూసుకెళితే ప్రత్యేకించి సింధు లోయను దాటి వస్తే పాక్ అణు దాడి చేసే అవకాశం ఉంది. రెండోది.. పాక్ సాయుధ దళాల్లో అధిక భాగాన్ని భారత్ నిర్వీర్యం చేస్తే ప్రత్యేకించి పాక్ వాయుసేనను చిన్నాభిన్నం చేసి భారత్ గట్టిగా దెబ్బతీస్తే లేదా పాక్ అణు కేంద్రాలు / స్థావరాలపై దాడి చేస్తే లేదా పాక్పై రసాయన / జీవ ఆయుధాలతో దాడిచేస్తే పాకిస్థాన్ ప్రతిగా అణుదాడికి తెగబడే ఛాన్స్ ఉంది.
ఇక మూడోది.. పాక్ నౌకాదళాన్ని దెబ్బతీసి నావల్ బ్లాకేడ్ (1971లో కరాచీ పోర్టును భారత్ దిగ్బంధం చేసిన తరహాలో) ద్వారా పాక్ ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేస్తే లేదా సింధు, జీలం, చినాబ్ నదుల్లో పాక్ వాటా జలాలను విడుదల చేయకుండా అడ్డుకుని పాక్ను ఆర్థికంగా అంతలాకుతలం చేస్తే శత్రుదేశం అణుదాడికి పాల్పడే అవకాశం ఉంది. ఇక చివరగా పాక్లో రాజకీయ అస్థిరత కలిగిస్తే లేదా పాక్లో ఏదైనా ప్రాంతాన్ని ఆ దేశం నుంచి విడగొడితే (బంగ్లాదేశ్ మాదిరి) అణు దాడికి పాల్పడే ఛాన్స్ ఉందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.