విజయ్ దేవరకొండ 12 చిత్రానికి కింగ్డమ్ టైటిల్.ఖరారు, యుద్ధం నేపథ్యంగా టీజర్
Vijay Devarakonda, Kingdom
విజయ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి 'కింగ్డమ్' అనే శక్తివంతమైన టైటిల్ ను ఖరారు చేసినట్లు తాజాగా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. టైటిల్ తో పాటు బుధవారం నాడు టీజర్ ను కూడా ఆవిష్కరించారు నిర్మాతలు. 'కింగ్డమ్' టీజర్ అద్భుతంగా ఉంది.
అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు, కట్టిపడేసే భావోద్వేగాలతో థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించే యాక్షన్ డ్రామాగా 'కింగ్డమ్' రూపొందుతోందని టీజర్ తో స్పష్టం చేశారు. ఈ ఇంటెన్స్ టీజర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
'కింగ్డమ్' టీజర్ తెలుగు వెర్షన్కి జూనియర్ ఎన్టీఆర్, తమిళ వెర్షన్కి సూర్య, హిందీ వెర్షన్కి రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ అందించారు. ఈ ముగ్గురు స్టార్లు తమ గొంతుతో రోమాలు నిక్కబొడుచుకునేలా చేసి, టీజర్ను మరో స్థాయికి తీసుకువెళ్లారు.
'కింగ్డమ్' చిత్రానికి విజయ్ దేవరకొండ ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు. సినిమాని వేరే స్థాయికి తీసుకొని వెళ్ళడానికి తన వైపు నుంచి నూటికి నూరు శాతం కృషి చేస్తున్నారు. విజయ్ సినిమాకి సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తే, దేశవ్యాప్తంగా సినీ ప్రియుల దృష్టి ఉండటం సహజం. 'కింగ్డమ్' టీజర్ విడుదల తేదీ ప్రకటన వచ్చిన దగ్గర నుంచి, ఈ టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూశారు. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా టీజర్ కట్టిపడేసింది. విజయ్ తన స్టార్డమ్కి తగిన సరైన కథ వస్తే.. ఏం చేయగలరో కేలవం టీజర్ తోనే రుజువు చేశారు.
'జెర్సీ' వంటి కల్ట్ క్లాసిక్ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండను పూర్తిగా సరికొత్త అవతార్లో చూపిస్తున్నారు. 'కింగ్ డమ్' టీజర్ విజయ్ అభిమానులను సంతృప్తి పరచడమే కాకుండా, సాధారణ ప్రేక్షకులలోనూ సినిమా చూడాలనే ఆసక్తిని మరింత పెంచింది.
సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ తనదైన నేపథ్య సంగీతంతో మరోసారి కట్టిపడేశారు. టీజర్ లో విజయ్ పాత్రను దర్శకుడు చూపించిన తీరు, దానిని తన సంగీతంతో అనిరుధ్ మరో స్థాయికి తీసుకువెళ్లిన తీరు అద్భుతం. ఛాయాగ్రాహకులు జోమోన్ టి. జాన్, గిరీష్ గంగాధరన్ తమ కెమెరా పనితనంతో చిత్రానికి మరింత అందం తీసుకు రాబోతున్నారు. ఈ సినిమాకి ఎడిటర్ గా నవీన్ నూలి, కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా వ్యవహరిస్తున్నారు.
వరుస ఘన విజయాలను సొంతం చేసుకుంటున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని భారీస్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.
2025, మే 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో 'కింగ్డమ్' విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. విడుదల తర్వాత ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరికొత్త సంచలనాలు సృష్టించి, ఘన విజయం సాధిస్తుందని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.