వైకాపా నేతలకు పీపీపీ అంటే ప్రైవేటీకరణ ... : సీఎం చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు
వైకాపా నేతలకు పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) అంటే ప్రైవేటీకరణ అనుకుంటున్నారని, పీపీపీ అంటే అసలు అర్థాన్ని వైకాపా నేతలు తెలుసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పేదలకు నాణ్యమైన, ఉచిత వైద్యాన్ని వేగంగా అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో వైకాపా నేతలు ఎందుకు రాద్దాంతం చేస్తూ అభ్యంతరం చెబుతున్నారో అర్థం కావడం లేదన్నారు. తాను ఏ కార్యక్రమం చేపట్టినా పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే చేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు.
గత పాలకుల విధానాలను అనుసరిస్తే రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి కావడానికి కనీసం 20 ఏళ్లు పడుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అదే పీపీపీ విధానంలో అయితే కేవలం రెండేళ్లలోనే నిర్మాణాలు పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావచ్చని ఆయన వివరించారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని పేద విద్యార్థులకు అదనంగా 110 మెడికల్ సీట్లు లభిస్తాయని, వారి వైద్య విద్య కలను సాకారం చేసేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతల తీరుపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'మీలో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే వెంటనే కార్పొరేట్ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. కానీ, అదే నాణ్యమైన వైద్య సేవలు పేద ప్రజలకు అందకూడదా?' అని ఆయన నిలదీశారు. ప్రజలకు మంచి చేస్తుంటే అడ్డుకోవడం సరికాదని, పీపీపీ విధానం ద్వారా పేదలకు మేలు జరుగుతుంటే ఎందుకు విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని చంద్రబాబు పునరుద్ఘాటించారు.