నేడు తీరందాటనున్న వాయుగుండం : ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన
వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మంగళవారం మధ్యాహ్నం ఒరిస్సా - ఉత్తర కోస్తాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వాయుుగుండం ఒరిస్సాలోని గోపాల్పూర్కు దక్షిణ ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమైవుంది. ఇది వాయువ్య దిశగా కదిలి తీరం దాటనుంది.
వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు, మిగిలిన కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. నాగావళి నదిలో వరద ప్రభావం క్రమంగా పెరుగుతోంది.
మరోవైపు, తుపాను పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్లో 08942 - 240557 నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు ఏవైనా అత్యవసరాలు ఎదురైతే వెంటనే ఈ నంబర్ను సంప్రదించాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.