గుంటూరులో కలకలం రేపుతున్న కలరా : నాలుగు కేసుల గుర్తింపు
జిల్లా కేంద్రమైన గుంటూరులో కలరా కలకలం రేపుతోంది. ఇప్పటికే నాలుగు కేసులు నమోదయ్యాయి. వీటిలో గుంటూరు నగరంలో మూడు, తెనాలిలో ఒక కేసు నమోదైంది. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గత ఐదు రోజులుగా వాంతులు విరేచనాలతో బాధపడుతున్న 146 మంది డయేరియా లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు. వీరిలో కొందరి నుంచి సేకరించిన నమూనాల్లో విబ్రియో కలరే బ్యాక్టీరియా ఉన్నట్టు నిర్ధారించారు.
గుంటూరు జీజీహెచ్తో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల నుంచి 114 నమూనాలు సేకరించగా, గుంటూరు వైద్య కాలేజీ మైక్రో బయాలజీ ల్యాబ్లో పరీక్షించారు. ఇందులో 91 శాంపిల్స్లో 3 నమూనాల్లో విబ్రియో కలరే, 16 నమూనాల్లో ఈ.కోలి బ్యాక్టీరియా, ఒక దానిలో షిగెల్లా బ్యాక్టీరియా ఉన్నట్టు నిర్ధారించారు. మిగిలిన 71 నమూనాల్లో ఎలాంటి బ్యాక్టీరియా లేదని గుర్తించారు.
పాత గుంటూరు నగరంలోని బాలాజీ నగర్ ప్రాంతాన్ని అధికార యంత్రాంగం కలరా కేంద్రంగా గుర్తించారు కలుషిత నీరే ప్రధాన కారమంగా భావిస్తున్నారు. దీంతో ప్రతి ఇంట్లోనూ తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రజలు కాచి చల్లార్చిన నీరు మాత్రమే తాగాలని వైద్యాధికారులు విజ్ఞప్తి చేారు.
మరోపైపు, ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ హుటాహుటిన గుంటూరు కలెక్టరేట్కు చేరుకుని ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో గుంటూరు నగరంలో 57 డివిజన్లలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు ఒక్కో బృందంలో 4 వార్డు కార్యదర్శులు, ఓ శానిటరీ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఇంజనీర్, టీపీఓ లేదా టీపీఎస్, నోడల్ అధికారి ఉండేలా జాబితాలు రూపొందించారు.