NTR book launch - Venkayya naidu, Chandra babau
తెలుగుదేశం ప్రభుత్వాలు తీసుకొచ్చిన ప్రతి పాలసీ దేశానికే ఆదర్శంగా నిలిచాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిలో తెలుగు వైభవం పేరుతో ఎన్టీఆర్ స్మృతి వనం ఏర్పాటు చేస్తామని, ఎన్టీఆర్ స్పూర్తితో స్వర్ణాంధ్ర కల సాకారం చేస్తామని, పేదరికం లేని సమాజం సాధిస్తామని స్పష్టం చేశారు. విజయవాడ పోరంకిలో నిర్వహించిన సజీవ చరిత్ర-1984 ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఈ పుస్తకాన్ని రూపొందించింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సజీవ చరిత్ర పుస్తకం 40 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లింది. ఆనాటి జ్ఞాపకాలన్నీ వరుసగా గుర్తుకొస్తున్నాయి. దేశ రాజకీయాల్లో 1983 ఒక సంచలనం. ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన యుగపురుషుడు నందమూరి తారక రామారావు. 1984లో జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం కూడా ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. నాటి కాంగ్రెస్ నాయకులు, ఢిల్లీ పెద్దలు తెరవెనుక కుట్రలకు తెర తీశారు. ప్రజాస్వామ్యయుతంగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని 20 నెలలకే ఇంటికి పంపించాలని చూశారు. గుండె ఆపరేషన్ కోసం ఎన్టీఆర్ అమెరికా వెళ్లి తిరిగి వచ్చిన రోజే కుట్రకు తెర తీశారు అని సీఎం చంద్రబాబు అన్నారు.
సమిష్టిగా పోరాడాం
ఆ రోజు ఏదో కుట్ర జరుగుతోందని అర్ధమైంది. దాన్ని తిప్పి కొట్టాలంటే మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండాలని రాత్రికి రాత్రే 161 ఎమ్మెల్యేలను ముషీరాబాద్ లోని రామకృష్ణ స్టూడియోలో పెట్టాం. అదో గేమ్ ఛేంజర్. ఆనాడు ఎమ్మెల్యే క్వార్టర్స్ కి ఎమ్మెల్యేలను తీసుకురావడంలో ఇంద్రసేనారెడ్డి ముఖ్య పాత్ర పోషించారు. వెంకయ్య నాయుడు ఎన్టీఆర్ వెనుకే ఉండి, దేశంలో ఉండే నేతలందరికి ఒక తాటిపై తీసుకొచ్చారు. ఎన్టీఆర్ కు వెంకయ్య నాయుడంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. ఆనాడు అప్రజాస్వామికంగా నాటి రాష్ట్ర గవర్నర్ రామ్లాల్ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. అసమ్మతి నాయకుణ్ని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టారు. ముఖ్యమంత్రిగా గవర్నరును కలవడానికి వెళ్లిన ఎన్టీఆర్ ను తిరిగి పోలీస్ వ్యాన్ లో కంట్రోల్ రూమ్ కు తీసుకెళ్లిన ఘటన ఎప్పటికీ మర్చిపోలేను." అని సీఎం చంద్రబాబు అన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం... ఓ చరిత్ర
కాంగ్రెస్ పార్టీ కుట్ర రాజకీయాలకు మొత్తం దేశమంతా భగ్గుమంది. నాడు ఎన్టీఆర్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెసేతర రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చారు. తెలంగాణ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ... ఇలా ప్రాంతంతో సంబంధం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ పరిరక్షణ ఉద్యమం చేశారు. ఓ నాయకుడికి చరిత్రలో ఎప్పుడూ చూడని సంఘీభావం చూశాను. ఆనాడు ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే మా ముందున్న అతిపెద్ద సవాల్. ఒక్కో ఎమ్మెల్యేకి మంత్రి పదవి, రూ. కోటి డబ్బు ఆఫర్ చేశారు. కానీ ఎందరో మాకు సహకరించారు. కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే ప్రభుత్వం మాకు షెల్టర్ ఇచ్చింది. నాటి మంత్రి రఘుపతి మాకు ఎంతో సాయం చేశారు." అని సీఎం చెప్పారు.
మహా పోరాటంలో గెలిచిన ఎన్టీఆర్
1947 నుంచి 1984 వరకు 26 కాంగ్రెసేతర ప్రభుత్వాల్ని కూల్చేశారు. 18 నెలలకు ఒక్కో ప్రభుత్వం పోయింది. కానీ మహా పోరాటంలో గెలిచిన ఒకే ఒక వ్యక్తి ఎన్టీఆర్. జాతీయ స్థాయిలో 18 పార్టీలు జట్టు కట్టాయి. గవర్నర్ రామ్లాల్ను రీకాల్ చేయాలనే నినాదం హోరెత్తింది. కట్టుబట్టలతో వెళ్లి 30 రోజులకు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే తిరిగొచ్చాను. నాలాంటి లక్షల మంది త్యాగాలు చేసి పోరాడారు. చరణ్సింగ్, చంద్రశేఖర్, వాజపేయి, అద్వానీ, జార్జి ఫెర్నాండజ్, కరుణానిధి, చండ్ర రాజేశ్వరరావు, మాకినేని బసవపున్నయ్య... కేంద్ర స్థాయి అఖిలపక్ష సారధ్య సంఘంలో ఉన్నారు. వెంకయ్యనాయుడు, ఇంద్రసేనారెడ్డి, బండారు దత్తాత్రేయ, సుందరయ్య పోరాడారు." అంటూ నాటి రోజులను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.
చరిత్రలో చిర స్థాయిగా నిలిచిన ఎన్టీఆర్
సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అని నమ్మిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. తెలుగువారి గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు. సజీవ చరిత్ర పేరుతో ఈ పుస్తకాన్ని భావితరాలకు అందజేసిన టీడీ జనార్ధన్ , విక్రమ్ పూలేని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. ఎన్టీఆర్ ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలను నేడు దేశమంతా అమలు చేస్తున్నారు. ఎన్టీఆర్ శ్రీకారం చుట్టిన నదుల అనుసంధానం దేశమంతటా అమలవుతోంది. ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో హక్కు కల్పిస్తే మనం స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. ఎన్టీఆర్ మహిళలకు స్థానిక సంస్థల్లో 9 శాతం రిజర్వేషన్లు పెడితే ప్రధాని మోదీ ఆధ్వర్యంలో చట్టసభల్లో ఆడబిడ్డలకు 33 శాతం రిజర్వేషన్లు వస్తున్నాయి. ఆనాడు ఎన్టీఆర్ యాంటీ కాంగ్రెస్ ఉద్యమం ప్రారంభించారు. నేడు దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుంది. ప్రధాని మోదీ సారధ్యంలో భారత ఆర్థిక వ్యవస్థను 4వ స్థానంలోకి తెచ్చారు. భవిష్యత్ లో ప్రపంచంలోనే మన దేశం అగ్రస్థానంలో నిలవబోతోంది." అని సీఎం చంద్రబాబు అన్నారు.
తెలుగుజాతిని నెంబర్ వన్ చేస్తాం
"ఎన్టీఆర్ విగ్రహం చూసి సంకల్పం తీసుకుంటే ఏ పనైనా దిగ్విజయంగా పూర్తవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ తెలుగు వైభవం, తెలుగుదనానికి ప్రతిబింబం. తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక. ఆయన జీవితం వడ్డించిన విస్తరి కాదు. పట్టుదల, ఆత్మ విశ్వాసంతో ఒక్కో మెట్టు ఎదిగారు. మనకు దేవుడంటే ఎన్టీఆరే. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, కర్ణుడు అంటే ఎన్టీఆర్ రూపంలోనే చూశాం. ప్రజాస్వామ్యంలో నియంత పోకడలకు చోటు లేదని 2024 ఎన్నికల్లో ప్రజలు నిరూపించారు. దేశానికి సంక్షేమం పరిచయం చేసిన ఎన్టీఆర్ స్పూర్తితో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం. అర్హులందరికీ సంక్షేమం అందిస్తాం. ప్రపంచంలోనే తెలుగుజాతిని నెంబర్ వన్ చేస్తాం." అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.