బుధవారం, 15 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్

ఖమ్మంలో దారుణం : 14 యేళ్ల విద్యార్థిపై మూడేళ్లుగా టీచర్ లైంగిక దాడి - తెలియగానే సూసైడ్

crime scene
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. 14 యేళ్ల విద్యార్థిపై ఓ ఉపాధ్యాయుడు మూడేళ్ళుగా లైంగికదాడికి పాల్పడుతూ వచ్చాడు. దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన బాలుడు తనపై జరుగుతున్న దారుణాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టీచరుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలియగానే ఆ టీచర్ పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లాలోని కొణిజర్ల మండల పరిధిలో సోమవారం జరిగింది. 
 
పోలీసుల కథనం మేరకు, మధిర మండలం ఆత్కూరు గ్రామాని చెందిన అరిగెల ప్రభాకర్ రావు (46) కొణిజర్ల మండలంలోని ఓ గురుకుల పాఠశాలలో ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు. అదే పాఠశాలలో చదువుతున్న 14 యేళ్ల విద్యార్థిపై మూడేళ్లుగా లైంగికదాడికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించడంతో బాలుడు భయపడి మౌనంగా ఉండిపోయాడు. 
 
ఇటీవల దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన బాలుడు, తిరిగి పాఠశాలకు వెళ్లేందుకు నిరాకరించాడు. తల్లిదండ్రుల ఎంత అడిగినా కారణం చెప్పలేదు. చివరకు గట్టిగా నిలదీయడంతో ఉపాధ్యాయుడు తన పట్ల ప్రవర్తిస్తున్న తీరును వవరించాడు. దీంతో బాలుడి తండ్రి ఆదివారం రాత్రి కొణిజర్ల పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రభాకర్ రావుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 
 
ఈ విషయం తెలియగానే పాఠశాల ప్రిన్సిపల్ ప్రభాకర్ రావును మందలించారని, దీంతో అతను తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు సమాచారం. తనపై కేసు నమోదైందని తెలుసుకున్న ప్రభాకర్ రావు తీవ్ర మనస్తాపంతో ఆదివారం రాత్రి తన స్వగ్రామంలోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ వద్ద పురుగుల మందు సేవించాడు. 
 
అనంతరం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని మధిరలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్ పొందుతూ సోమవారం ప్రభాకర్ రావు మృతి చెందాడు.