మహిళను హత్య చేసి.. గోనె సంచిలో మూటగట్టి... రైల్వే స్టేషన్ వద్దపడేశారు...
తెలంగాణ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ మహిళను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు చేసి ఒక గోనె సంచిలో మూట గట్టి.. ఆ మూటను చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రహరీ గోడ వద్ద పడేశారు. ఈ మూటను సోమవారం మధ్యాహ్నం 11.45 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి ఆటోలో తీసుకొచ్చి పడేసినట్టు సీసీటీవీ కెమెరా దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు గుర్తించారు.
బీహార్కు వెళ్లే రైలు కోసం సోమవారం భారీగా ప్రయాణికులు స్టేషన్ సమీపంలో వేచివున్నారు. అదేసమయంలో ఆటోలో అక్కడిక వచ్చిన వ్యక్తి మూటను వదిలి వెళ్లినట్టు గుర్తించారు. బీహార్కు వెళ్లే రైలు ఆలస్యంగా రావడంతో మంగళవారం మధ్యాహ్నం వరకు కూడా ప్రయాణికులు అక్కడే ఉన్నారు. ప్రయాణికులంతా వెళ్లిపోయిన తర్వాత అక్కడ మూట ఉండటాన్ని స్థానికంగా ఉన్న ఆటో డ్రైవర్లు గుర్తించి, పోలీసులకు సమాచారం చేరవేశారు.
దీంతో పోలీసులు వచ్చి ఆ మూటను విప్పి చూడగా అందులో మహిళ మృతదేహం ఉండటంతో చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతురాలి వయసు 30 నుంచి 40 యేళ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనపై చర్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.