మంగళవారం, 8 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య

murder
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ ఓ భార్య... కట్టుకున్న భర్తను కడతేర్చింది. అప్పటికే పక్షవాతంతో మంచానికే పరిమితమైన భర్తను దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. ఆ తర్వాత ఈ హత్యను సహజ మరణంగా చిత్రీకరించి కేసు నుంచి తప్పించుకోవాలని చూసింది. అయితే, ఆమె యవ్వారం పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఈ దారుణం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నాగ్‌పూర్‌కు చెందిన దిశా రాంటెకే (30), చంద్రసేన్ రాంటెకే (38) దంపతులకు 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. రెండేళ్ల క్రితం చంద్రసేన్‌కు పక్షవాతం రావడంతో అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యాడు. దీంతో దిశా వాటర్ క్యాన్‌లు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తోంది. అయితే, భార్య శీలాన్ని చంద్రసేన్ తరచూ శంకించడంతో వారి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
 
ఈ క్రమంలో రెండు నెలల క్రితం దిశాకు ఆసిఫ్ ఇస్లాం అన్సారీ అనే మెకానిక్‌తో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం ఇటీవల చంద్రసేన్‌కు తెలియడంతో భార్యతో గొడవపడ్డాడు. దీంతో అడ్డు తొలగించుకోవాలని భావించిన దిశా, ప్రియుడు ఆసిఫ్‌తో కలిసి భర్త హత్యకు కుట్ర పన్నింది.
 
ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో నిద్రిస్తున్న చంద్రసేన్‌ను దిశా కదలకుండా పట్టుకోగా, ఆసిఫ్ దిండుతో ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అనంతరం ఏమీ తెలియనట్లు నాటకమాడారు. అయితే, చంద్రసేన్ మృతిపై అనుమానం రావడంతో పోస్టుమార్టం నిర్వహించగా, ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. దీంతో పోలీసులు దిశాను అదుపులోకి తీసుకుని విచారించగా, ప్రియుడితో కలిసి తానే హత్య చేసినట్లు నేరాన్ని అంగీకరించింది. దీంతో వారిద్దరిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.