ఇండియన్ టాలెంట్తో అమెరికా ఎంతో మేలు జరిగింది : ఎలాన్ మస్క్
టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిభావంతులైన భారతీయుల వల్ల అమెరికాకు ఎంతో మేలు జరిగిందన్నారు. జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన 'పీపుల్ బై డబ్ల్యూటీఎఫ్' పాడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. అదేసమయంలో, కొన్ని కంపెనీలు హెచ్-1బీ వీసా విధానాన్ని దుర్వినియోగం చేశాయని, అందుకే అమెరికాలో కొన్ని వలస వ్యతిరేక విధానాలు వచ్చాయని గుర్తు చేశారు.
హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్పై మస్క్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. 'కొన్ని ఔట్సోర్సింగ్ కంపెనీలు హెచ్-1బీ వీసా వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. ఈ దుర్వినియోగాన్ని అరికట్టాలి. కానీ, అంతమాత్రాన హెచ్-1బీ ప్రోగ్రామ్ను పూర్తిగా మూసివేయాలనే వాదన సరైంది కాదు. అలా చేస్తే దేశానికి తీవ్ర నష్టం జరుగుతుంది' అని ఆయన వివరించారు.
ప్రతిభావంతుల కొరత ఎప్పుడూ ఉంటుందని మస్క్ అన్నారు. 'కొందరు అనుకున్నట్లు వలసదారుల వల్ల స్థానికులు ఉద్యోగాలు కోల్పోతున్నారనేది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. మా కంపెనీలలో క్లిష్టమైన పనులను పూర్తి చేయడానికి తగినంత మంది ప్రతిభావంతులు దొరకడమే కష్టంగా ఉంది. అందుకే, మరింత మంది ప్రతిభావంతులు వస్తే మంచిదే' అని తెలిపారు. తమ కంపెనీలలో ప్రపంచంలోని అత్యుత్తమ టాలెంట్ ఉన్నవారికే ప్రాధాన్యం ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.