పరప్పణ అగ్రహార జైలులో లైబ్రరీ క్లర్క్గా మాజీ ఎంపీ రేవణ్ణ
ఇంటి పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు యావజ్జీవ కారాగార శిక్షను విధించగా, ఆయన ప్రస్తుతం బెంగుళూరులో పరప్పణ అగ్రహార జైలులో జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయనకు ఈ జైలులో లైబ్రరీ క్లర్క్ విధులను కేటాయించారు. తోటి ఖైదీలకు పుస్తకాలు జారీ చేయడం, వాటికి సంబంధించిన వివరాల రికార్డులను నిర్వహించడం వంటి బాధ్యతలు అప్పగించారు.
ప్రతి పని దినానికి రూ.522 జీతంగా ప్రజ్వల్కు అందిస్తామని అధికారులు పేర్కొన్నారు. జైలు నిబంధనల ప్రకారం.. జీవిత ఖైదు అనుభవిస్తున్న వారు జైల్లో ఏదో ఒక రకమైన పని చేయాల్సి ఉంటుందని.. వారి నైపుణ్యాలను బట్టి నియామకాలు చేపడతామన్నారు. ప్రజ్వల్ ఆఫీస్ వర్క్ను ఎంచుకోవడంతో లైబ్రరీ క్లర్క్గా పని కేటాయించామన్నారు. జైల్లో ఖైదీలు సాధారణంగా నెలకు కనీసం 12 రోజులు, వారానికి మూడు రోజులు తప్పకుండా పని చేయాలనే నిబంధనలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
కాగా, గతేడాది లోక్సభ ఎన్నికల వేళ హాసన సెక్స్ కుంభకోణం కర్ణాటకలో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పుడు ఓ మహిళ షాకింగ్ విషయాలు వెల్లడించింది. తన తల్లిపై కొన్నేళ్ల క్రితం బెంగళూరులోని నివాసంలో ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. దీనికి సంబంధించి సిట్ అధికారుల ఎదుట వాంగ్మూలాన్ని ఇచ్చింది. అనంతరం పలువురు మహిళలు ఆయనపై ఆరోపణలు చేశారు. విచారణలో ప్రజ్వల్ దోషిగా తేలడంతో కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది.