కాశ్మీర్లో సాగుతున్న ఉగ్రవేట... ఆయుధాలతో ఇద్దరి అరెస్టు - యుద్ధ సన్నద్ధతపై కీలక భేటీ!!
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. దేశ వ్యాప్తంగా అలెర్ట్ ప్రకటించాయి. ఇందులోభాగంగా, జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో మాత్రం ఉగ్రవేట కొనసాగుతోంది. తాజాగా నిర్వహించిన తనిఖీల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. వారి నుంచి ఆయుధాలతో పాటు గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఉగ్ర వ్యతిరేక ఆపరేషన్లో భాగంగా, బుద్గాంలో నాకా చెకింగ్ చేపట్టారు. ఈ క్రమంలోనే అనుమానాస్పద కదలికలతో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీ చేయగా, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, ఫిస్టల్, గ్రనేడ్లు, తూటాలు లభించాయి. దీంతో వారిని అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీరు ఉగ్రవాదులకు సాయం చేస్తున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు గుర్తించారు.
మరోవైపు, కేంద్ర ప్రభుత్వం యుద్ధ అప్రమత్తతకు పిలుపునిచ్చిన నేపథ్యంలో యుద్ధ సన్నద్ధతపై కేంద్రం హోం శాఖ మంగళవారం కీలక భేటీని నిర్వహించనుంది. బుధవారం అన్ని రాష్ట్రాల్లో సివిల్ మాక్ డ్రిల్స్ చేయాలని కేంద్రం సోమవారం ఆదేశించిన విషయం తెల్సిందే.