Monsoon: కేరళలో ఆ 3 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ.. మరో ఏడు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్
కేరళలో రుతుపవనాలతో గురువారం వర్షాలు తీవ్రమయ్యాయి. ఎర్నాకుళం, ఇడుక్కి. త్రిస్సూర్ జిల్లాల్లోని కొన్ని లోతట్టు ప్రాంతాలు వరదలకు గురయ్యాయి. భారత వాతావరణ శాఖ (IMD) మూడు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు. బలమైన గాలుల కారణంగా కొన్ని చోట్ల హోర్డింగ్లు కూలిపోయాయి. చెట్లు విరిగిపడ్డాయి. ఇంకా సాధారణ జనజీవనానికి అంతరాయం కలిగింది. ఇడుక్కి, మలప్పురం, వయనాడ్ జిల్లాల్లో ఐఎండీ గురువారం రెడ్ అలర్ట్ను, రాష్ట్రంలోని మరో ఏడు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది.
రెడ్ అలర్ట్ అంటే 24 గంటల్లో 20 సెం.మీ కంటే ఎక్కువ భారీ వర్షపాతం, ఆరెంజ్ అలర్ట్ అంటే 11 సెం.మీ నుండి 20 సెం.మీ వరకు అతి భారీ వర్షం, ఎల్లో అలర్ట్ అంటే 6 సెం.మీ నుండి 11 సెం.మీ మధ్య భారీ వర్షపాతం నమోదవుతుంది. అంతేకాకుండా, వర్షాల కారణంగా ప్రమాదకర స్థాయిలో నీటి మట్టాలు ఉన్న వివిధ నదులకు సంబంధించి రాష్ట్ర నీటిపారుదల శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఎర్నాకుళం జిల్లాలోని మువత్తుపుళ నది, త్రిస్సూర్, మలప్పురం గుండా ప్రవహించే భారతపుళ, పతనంతిట్టలోని అచంకోవిల్, పంబా నదులు, కొట్టాయంలోని మణిమల, ఇడుక్కిలోని తొడుపుళ నది, వయనాడ్లోని కబాని వంటి నదులకు సంబంధించి హెచ్చరికలు జారీ చేసింది.
నదుల నీటి మట్టాలు పెరగడం, భారీ వర్షాలతో ఎర్నాకుళం, త్రిస్సూర్, ఇడుక్కి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. వందలాది మందిని సహాయ శిబిరాలకు తరలించారు. ఇంతలో, వయనాడ్ జిల్లాలోని ముందక్కై-చూరల్మల ప్రాంతంలో నిరంతర వర్షాల ఫలితంగా చూరల్మల నది ఉధృతంగా ప్రవహిస్తోంది.
బురద నీరు బలంగా ప్రవహించి బెయిలీ వంతెన సమీపంలోని ఒడ్డులను కోసేసింది. గత సంవత్సరం జూలైలో, ఈ ప్రాంతంలో ఘోరమైన కొండచరియలు విరిగిపడి 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.