గురువారం, 2 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 సెప్టెంబరు 2025 (19:42 IST)

ఈవీఎంలను కాంగ్రెస్ హ్యాక్ చేస్తే ఎవరూ అడగలేదు.. మేం చేస్తే మాత్రం : ఢిల్లీ సీఎం రేఖా గుప్తా

rekha gupta
గత 70 యేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలను హ్యాక్ చేస్తూనే ఉందని, అపుడు మాత్రం ఎవరూ అడగలేదని ఇపుడు మేము చేస్తే మాత్రం ప్రశ్నిస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి, బీజేపీ మహిళా నేత రేఖా గుప్తా అన్నారు. ఈ వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈవీఎం మెషీన్ల ట్యాంపరింగ్‌పై చర్చ సాగుతున్న వేళ బీజేపీకి చెందిన ఢిల్లీ ముఖ్యమంత్రి ఇలా వ్యాఖ్యలు చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారాయి.
 
ఆమె తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. "మీరు ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు కదా?" అని విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ రేఖా గుప్తా పైవిధంగా స్పందించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే అది ప్రజా తీర్పు అని, అదే తాము గెలిస్తే మాత్రం ఈవీఎం హ్యాకింగ్ అని అంటున్నారని ఆమె మండిపడ్డారు. "ఈ ద్వంద్వ నీతి ఏ పుస్తకంలో ఉందో రాహుల్ గాంధీ చెప్పాలి. దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడం తప్ప ఆయనకు ఇంకేమైనా తెలుసా?" అని ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 
 
ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన 13 సెకన్ల నిడివి గల వీడియో క్లిప్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజీవాల్ తన 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేశారు. "ఢిల్లీ సీఎం ఏం చెబుతున్నారో చూడండి" అనే వ్యాఖ్యను జోడించడంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. 
 
అయితే, కేజ్రీవాల్ పోస్ట్ చేసింది కేవలం కత్తిరించిన వీడియో అని, పూర్తి ఇంటర్వ్యూ చూడాలంటూ కొన్ని ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్లు నిమిషంన్నర నిడివి గల అసలు వీడియోను బయటపెట్టాయి. ఆ పూర్తి వీడియోలో కూడా రేఖా గుప్తా అవే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీంతో ఈవీఎంల విశ్వసనీయతపై జరుగుతున్న చర్చకు ఆమె వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోసినట్లయింది.