ఓట్ల చోరులను ఎన్నికల సంఘం కాపాడుతోంది : ఖర్గే
ఓట్ల చోరులను ఎన్నికల సంఘం పదేళ్లుగా కాపాడుతోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. పదేళ్లుగా ఈసీ ఓటు చోరులను కాపాడుతూ వస్తూ.. కీలక సమాచారాన్ని దాచి పెట్టిందన్నారు. 2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటరు జాబితా నుంచి ఓట్లను తొలగించడానికి చేసిన యత్నానికి సంబంధించిన కీలకమైన డేటాను ఇప్పటికీ ఎన్నికల కమిషన్ బయటపెట్టలేదని అన్నారు.
మే 2023 కర్ణాటక ఎన్నికలకు ముందు అలంద్ నియోజకవర్గంలో ఓటర్లను తొలగించాలని చేసిన ప్రయత్నాలను తమ పార్టీ బయటపెట్టిందన్నారు. అప్పట్లో దీనివల్ల వేలమంది ఓటర్లు తమ ఓటు హక్కులు కోల్పోయారన్నారు. ఓటర్లను మోసం చేయడానికి జరిగిన భారీ ప్రయత్నానికి స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నప్పటికీ కీలక విషయాలను దాచిపెట్టి.. ఓట్ల చోరీ వెనుక ఉన్న వారిని ఈసీ సమర్థంగా రక్షించిందన్నారు.
ఓట్ల చోరీకి పాల్పడుతున్న వారిని కాపాడటమే లక్ష్యంగా ఈసీ పదేళ్లుగా పని చేస్తోందన్నారు. అందుకు చట్టాలను మార్చడానికి కూడా వెనకాడట్లేదన్నారు. నాడు కర్ణాటకలో చేసిన విధంగా ప్రస్తుతం బిహార్లోనూ ఓటు చోరీకి పాల్పడడానికి కేంద్రం, ఈసీ కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. కేంద్రం చేస్తున్న కుట్రలో భాగంగానే ప్రస్తుతం బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ మోడీ ఓట్ల చోరీ ద్వారా గెలవడానికి యత్నిస్తున్నారని ఖర్గే ఆరోపించారు.
మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాలలో ఎన్డీయే ప్రభుత్వం ఓట్ల చోరీ చేసిందని.. బిహార్లో మాత్రం భాజపా, ఈసీని ఒక్క ఓటు కూడా చోరీ చేయనివ్వబోమని అన్నారు. త్వరలో ఎన్డీయే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా బిహార్లో చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర దేశవ్యాప్తంగా ఉద్యమంగా మారుతుందన్నారు.