జీఎస్టీ ఆఫీసర్ ఇంట్లో చోరీ.. రూ.60లక్షల విలువైన నగదు, బంగారం, వజ్రాలు గోవిందా!
హైదరాబాద్ మధురానగర్ కాలనీలో రిటైర్డ్ జీఎస్టీ సూపరింటెండెంట్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని దొంగలు రూ.60 లక్షల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు, నగదును దోచుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మధురానగర్లోని సత్యదేవి విల్లాస్లో ఉన్న ఆకుల హరిరావు ఇంట్లోకి చొరబడిన దుండగులు నకిలీ కీలను ఉపయోగించి లాకర్లను తెరిచి లోపల ఉన్న విలువైన వస్తువులను దొంగిలించారు.
హరిరావు తన కుటుంబంతో కలిసి జూన్ 21న ఆంధ్రప్రదేశ్లోని తన స్వస్థలానికి బయలుదేరాడు. జూన్ 24న తిరిగి వచ్చేసరికి ప్రధాన తలుపు తెరిచి ఉండి, ఇంట్లోని సామాగ్రి చెల్లాచెదురుగా పడి ఉండటం గమనించాడు.
ఇంటి లోపల, బెడ్రూమ్లోని లాకర్ను తెరిచి వుండటం చూసి షాకయ్యాడు. ఇంకా లాకర్లోని, విలువైన వస్తువులు కనిపించకుండా పోయాయని తెలుసుకుని ఖంగుతిన్నాడు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.