బుధవారం, 26 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 25 నవంబరు 2025 (23:36 IST)

విజయార్పణం... నృత్య సమర్పణం

Vijayarpanam
పూజ్యనీయ గురువులకు, శిష్య పరంపరకు మధ్య ఉండాల్సిన రుణ అనుబంధాలకు అద్దం పడుతూ, ఆది గురువులైన తల్లిదండ్రులను గౌరవించాల్సిన అవసరాన్ని వివరిస్తూ సాగిన విజయ అర్పణ్‌ ఆకట్టుకుంది. నగరానికి చెందిన విజయ లక్ష్మి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కింగ్‌కోఠిలోని భారతీయ విద్యాభవన్‌లో నిర్వహించిన విజయఅర్పణ్‌ అటు కళాత్మకతనూ ఇటు సందేశాన్ని మేళవిస్తూ సాగిన అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమంగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.
 
ప్రముఖ కళాకారిణి శ్రావ్య మృదుల సారధ్యంలో శ్రీ నటరాజ కళానికేతన్‌కు చెందిన ఔత్సాహిక యువ కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ నృత్య ప్రతిభతో ఆకట్టుకున్నారు. సాంప్రదాయ  సమకాలీన శైలుల సమ్మేళనంతో ఏకంగా 50 మంది కళాకారులు పాల్గొన్న ఆకర్షణీయమైన కూచిపూడి నృత్య ప్రదర్శన, భారతదేశపు ఘనమైన కళా వారసత్వ వైభవానికి అద్దం  పట్టింది. ప్రత్యక్ష ఆర్కెస్ట్రాకు చోటు కల్పించడంతో పాటు కూచిపూడి యక్షగానాల వినూత్న కలయిక కూడా ప్రదర్శన ప్రత్యేకత. ఈ సందర్భంగా ప్రముఖ నర్తకి శ్రావ్య మృదుల మాట్లాడుతూ యువ నృత్యకారులకు ప్రోత్సాహాన్ని అందించేందుకు తన తల్లి గారైన విజయలక్ష్మి స్మృతికి నివాళిగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని వివరించారు.
 
ఈ కార్యక్రమంలో కూచిపూడి నాట్య ప్రముఖులు యక్షగాణ కంఠిరవ డా.పసుమర్తి  శేషుబాబు, డా.పసుమర్తి వెంకటేశ్వర శర్మలు ముఖ్య అతిధులుగా, ప్రత్యేక అతిధిగా కళారత్న చింతా రవి డా.బాలకృష్ణ  పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా గురువులను సన్మానించారు సన్మానం పొందిన వారిలో గురు శ్రీ దేవరకొండ నాగసాయి, గురు శ్రీ రమణి సిద్ది, గురు శ్రీమతి ఇందిరా పరశురామ్‌లు వున్నారు. ఈ సందర్బంగా ఈ కళారంగ ప్రముఖులు మాట్లాడుతూ కళాకారుల ప్రతిభను అభినందించారు. మన ఈ యువత దేశ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచం నలుమూలలా చాటాలని ఆకాంక్షించారు.