పెంట్ హౌస్ను ఎలా నిర్మిస్తారు? నిర్మాత అల్లు అరవింద్కు జీహెచ్ఎంసీ నోటీసులు
ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అనుమతి లేకుండా పెంట్ హౌస్ను నిర్మించినందుకు ఈ నోటీసులు జారీచేశారు. అక్రమంగా నిర్మించిన ఈ పెంట్ హౌస్ను ఎందుకు కూల్చివేయకూడదో చెప్పాలని అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45లో సుమారు వెయ్యి గజాల స్థలంలో అల్లు బిజినెస్ పార్క్ పేరుతో అల్లు అరవింద్ ఒక భవనాన్ని నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్తో పాటు మరో నాలుగు అంతస్తుల నిర్మాణానికి ఆయన జీహెచ్ఎంసీ అధికారుల నుంచి ముందుగా అనుమతి తీసుకున్నారు. ఈ భవనం నిర్మాణం సుమారు యేడాది క్రితమే పూర్తయింది.
అయితే, ఇటీవల ఆయన ఈ భవనంపై ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా పెంట్ హౌస్ను నిర్మించారు. ఈ విషయం జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి చేరింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు... ముందస్తు అనుమతులు లేకుండా నిర్మించిన ఈ పెంట్ హౌస్ను అక్రమ నిర్మాణంగా పరిగణించి సోమవారం అల్లు అరవింద్కు నోటీసులు జారీచేశారు. తగిన వివరణ ఇవ్వని పక్షంలో చట్ట ప్రకారం కూల్చివేత చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.