Kandula Durgesh, CII Big Picture Summit - 2025
సినిమా షూటింగ్లకు, పర్యాటకానికి ప్రధాన కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒక కొత్త అధ్యాయాన్ని రచిస్తున్నామని ఈ క్రమంలో ఏపీ సినిమాటోగ్రఫీకి కొత్త శకం ఆరంభమైందని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. ముంబయి జుహూలోని జేడబ్ల్యూ మారియట్ హోటల్ లో డిసెంబర్ 1, 2 తేదీల్లో జరుగుతున్న ప్రతిష్టాత్మక సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ - 2025 లో రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రసంగం చేశారు. ఏపీలో సమగ్రమైన కొత్త 'ఫిల్మ్ టూరిజం పాలసీ'ని ఆవిష్కరించడానికి వేగంగా పని చేస్తున్నామని తెలిపారు.
ఇది ప్రొడక్షన్ నుండి ఎగ్జిబిషన్ వరకు తెలుగు సినిమా పరిశ్రమను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ఒక విజనరీ డాక్యుమెంట్ అని అభివర్ణించారు.భారతదేశ మీడియా, ఎంటర్ టైన్ మెంట్ రంగంలో పెట్టుబడులు పెడితే అవసరమైన ప్రోత్సాహం, భరోసా కల్పిస్తామని, కలిసి పనిచేద్దామని ఇన్వెస్టర్లకు మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.
మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, హిందీ తర్వాత భారతదేశంలో తెలుగు సినీ పరిశ్రమ రెండవ అతిపెద్దదిగా నిలిచిందన్నారు. ఇది జాతీయ చలనచిత్ర పరిశ్రమకు దాదాపు 20% వాటాను అందిస్తోందని స్పష్టం చేశారు. 'బాహుబలి, ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడీ, పుష్ప సిరీస్ లు, సలార్, ఓజీ' వంటి ప్రపంచ స్థాయి సినిమాలు కథాకథనం, విజువల్ ఎఫెక్ట్స్, నిర్మాణ నాణ్యతలో అద్భుతంగా ఉండి బాక్సాఫీస్ కలెక్షన్లలో కొత్త బెంచ్మార్క్లను సెట్ చేసి తెలుగు సృజనాత్మకతకు నిదర్శనంగా నిలిచిచాయని, తెలుగు సినిమాను గ్లోబల్ బ్రాండ్గా మార్చాయని తెలిపారు. చేశాయన్నారు.తమిళనాడు తర్వాత అత్యధికంగా ఏపీలో 1,103 స్క్రీన్లు ఉన్నాయని, ఈ రంగానికి తమ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు.
నంది అవార్డులు పనురుద్ధరణ
భారతదేశ మీడియా, ఎంటర్ టైన్ మెంట్ రంగ భవిష్యత్తు శక్తివంతంగా ఉందని, డిజిటల్గా, ప్రపంచవ్యాప్తంగా తమ రంగం విస్తరించి ఉందని ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఈ పరివర్తనలో ముందంజలో ఉండటానికి కృతనిశ్చయంతో ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈ నేపథ్యంలో ఏపీని దేశంలోనే సినిమా షూటింగ్లకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా మారుస్తామని స్పష్టం చేశారు. ప్రొడక్షన్ నుండి ఎగ్జిబిషన్ వరకు పరిశ్రమను బలోపేతం చేసేందుకు సమగ్రమైన కొత్త 'ఫిల్మ్ టూరిజం పాలసీ'ని త్వరలో ఆవిష్కరిస్తామని తెలిపారు.ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ సిటీలు, ఆధునిక స్టూడియోలు, డబ్బింగ్ మరియు రీ-రికార్డింగ్ సౌకర్యాలు నిర్మించే వెంచర్లకు ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందని భరోసానిచ్చారు. షూటింగ్ల కోసం ప్రభుత్వ, బహిరంగ ప్రాంతాల్లో అనుమతులు వేగంగా, పారదర్శకంగా, అవాంతరాలు లేకుండా లభిస్తాయని వెల్లడించారు. రాష్ట్ర కళాకారులు, సాంకేతిక నిపుణులను గౌరవించేందుకు ప్రతిష్టాత్మక నంది అవార్డులు, నంది నాటకోత్సవాలను త్వరలో పునరుద్ధరిస్తామని ప్రకటించారు.
AI, VFX, గేమింగ్ వంటి రంగాలకు ఏపీని గ్లోబల్ హబ్
ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి $2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే 'స్వర్ణాంధ్ర విజన్' తమ లక్ష్యమని మంత్రి దుర్గేష్ తెలిపారు. AI, VFX, గేమింగ్ వంటి రంగాలకు ఏపీని గ్లోబల్ హబ్గా ('ఆంధ్రా వ్యాలీ') మార్చేందుకు భారీగా పెట్టుబడి పెడుతున్నామని వెల్లడించారు. బీచ్ల నుండి నదుల వరకు , తీర్థయాత్రల నుండి హిల్ స్టేషన్ల వరకు ఆంధ్రప్రదేశ్ సహజ సౌందర్యం, సాంస్కృతిక వారసత్వాల అద్భుతమైన మిశ్రమాన్ని అందిస్తుందని మంత్రి దుర్గేష్ వివరించారు. విశాఖపట్నం, భీమునిపట్నం మరియు కాకినాడ వంటి స్వచ్ఛమైన బీచ్ల నుండి గోదావరి మరియు కృష్ణ నదుల సుందరమైన తీరాల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటకులకు స్వర్గధామం అని పేర్కొన్నారు. తిరుపతి, శ్రీశైలం వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు కోట్లాది మంది భక్తులు తరలివస్తారని, "ఆంధ్రా కాశ్మీర్"గా పిలువబడే అరకు లోయ, లంబసింగి వంటి చల్లని హిల్ స్టేషన్లకు ప్రకృతి ప్రేమికులు భారీగా తరలివచ్చి ఆస్వాదిస్తారని తెలిపారు. ఈ క్రమంలో ఏపీలో విశాఖపట్నం, తిరుపతి, అమరావతి, శ్రీశైలం, అరకు లోయ, రాజమండ్రి, గండికోటలను ప్రధాన యాంకర్ హబ్లను అభివృద్ధి చేస్తున్నామని, ఆయా ప్రాంతాల్లో పటిష్టమైన "హబ్-అండ్-పోక్" మోడల్ ద్వారా అడ్వెంచర్, ఎకో, టెంపుల్, ఫిల్మ్ టూరిజం వంటి 21 థీమాటిక్ సర్క్యూట్లలో విభిన్నమైన పెట్టుబడి మార్గాలను ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ తరుణంలో ప్రపంచ పర్యాటక ప్రచారానికి సినిమాలు అత్యంత శక్తివంతమైన సాధనాల్లో ఒకటిగా భావించి సినిమా,సాంస్కృతిక, పర్యాటక రంగాల అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లతో పాటు తాను ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామన్నారు.ప్రత్యేకించి సినిమాటోగ్రఫీని ఉపయోగించి ఏపీ అందాలను ప్రపంచానికి చూపిస్తామని తెలిపారు..