ఐదేళ్ల చిన్నారిపై పాశవికంగా దాడి చేసిన ఆయా
హైదరాబాద్ నగరంలోని షాపూర్ నగర్లో ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. నర్సరీ పాఠశాలలో చదువుతున్న ఐదేళ్ల చిన్నారిపై పాఠశాల ఆయా అత్యంత పాశవికంగా దాడి చేసింది. ఈ దారుణాన్ని కొందరు మొబైల్ ఫోనులో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితురాలిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... ఒడిశాకు చెందిన సంతోషి, కలియా దంపతులు తమ ఐదేళ్ల కుమార్తె ధరిత్రితో కలిసి కొన్ని నెలల క్రితం నగరానికి వలస వచ్చారు. షాపూర్ నగర్లోని పూర్ణిమా స్కూల్లో సంతోషి ఆయాగా పనిచేస్తుండగా, కుమార్తె ధరిత్రి అదే స్కూల్లో నర్సరీ చదువుతోంది. అదే పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్న లక్ష్మమ్మ, తల్లిలేని సమయంలో చిన్నారిని కొన్నాళ్లుగా హింసిస్తోంది.
శనివారం సాయంత్రం లక్ష్మమ్మ మరోసారి చిన్నారిపై విరుచుకుపడింది. జుట్టు పట్టుకుని తలను నేలకేసి బాదడమేకాకుండా, కిందపడేసి కాలితో తొక్కింది. ఈ ఘటనను పాఠశాల పక్కన ఉన్న ఓ బాలుడు వీడియో తీసి చిన్నారి తల్లిదండ్రులకు ఇచ్చాడు. వారు పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో ఆదివారం జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించారు.
వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితురాలు లక్ష్మమ్మను అెరెస్టు చేశారు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితురాలిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.