1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 మే 2026 (19:16 IST)

అండమాన్-నికోబార్ బీచ్‌ నీటి అడుగున జాతీయ జెండా - గిన్నిస్ రికార్డ్

Guinness World Record
Guinness World Record
అండమాన్-నికోబార్ పరిపాలన విభాగం శనివారం రాధానగర్ బీచ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద నీటి అడుగున జాతీయ జెండాను ఎగురవేసి కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. సుమారు 60 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పు ఉన్న ఈ భారీ త్రివర్ణ పతాకాన్ని స్వరాజ్ ద్వీప్ (హేవ్‌లాక్ ద్వీపం) వద్ద సముద్రం అడుగున దించారు. 
 
ఈ ఆపరేషన్‌లో పలు ఏజెన్సీలు, శిక్షణ పొందిన డైవర్లు పాలుపంచుకున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ డీకే జోషి, చీఫ్ సెక్రటరీ చంద్ర భూషణ్ కుమార్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హెచ్ఎస్ ధాలివాల్‌తో పాటు సీనియర్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు అండమాన్- నికోబార్ పోలీసులు, అటవీ శాఖ, భారత నౌకాదళం, భారత తీర రక్షక దళ సిబ్బందితో పాటు, వివిధ డైవింగ్ కేంద్రాలకు చెందిన స్కూబా డైవర్లు కలిసికట్టుగా ఈ క్లిష్టమైన నీటి అడుగున జెండాను ఆవిష్కరించారు. 
 
ఉదయం 10.35 గంటలకు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ న్యాయనిర్ణేత రిషి నాథ్ ఈ ఘనతను లాంఛనంగా ధృవీకరించి, జోషికి ధృవపత్రాన్ని అందజేశారు. సభను ఉద్దేశించి జోషి మాట్లాడుతూ, ఈ ఘనత ద్వీపాల విశిష్ట విజయాల రికార్డుకు ఒక ముఖ్యమైన చేర్పు అని, ఇందులో పాల్గొన్న బృందాల సమన్వయాన్ని, నిబద్ధతను ప్రశంసించారు. 
 
లెఫ్టినెంట్ గవర్నర్, సీనియర్ అధికారులు హాజరుకానున్న నేపథ్యంలో, ఆదివారం నాడు స్వరాజ్ ద్వీప్‌లోని లైట్‌హౌస్ డైవ్ సైట్‌లో 'అత్యంత ఎత్తైన మానవ మేడ' (టాలెస్ట్ హ్యూమన్ స్టాక్) అనే మరో గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పేందుకు పరిపాలన యంత్రాంగం ప్రయత్నించనుంది. 
 
సాహస పర్యాటకం, సముద్ర కార్యకలాపాలు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కార్యక్రమాలకు గమ్యస్థానంగా అండమాన్- నికోబార్ దీవులకు పెరుగుతున్న ప్రాముఖ్యతను ఈ ఘనత చాటిచెబుతోంది.