అండమాన్ సముద్ర గర్భంలో సహజవాయువు నిక్షేపాలు..
భారత ఇంధన రంగంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అండమాన్ సముద్ర గర్భంలో సహజ వాయువు నిక్షేపాలను కనుగొన్నట్లు ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్) అధికారికంగా ప్రకటించింది. అండమాన్ దీవుల తూర్పు తీరానికి సుమారు 17 కిలోమీటర్ల దూరంలో చేపట్టిన అన్వేషణలో ఈ గ్యాస్ జాడలు లభ్యమయ్యాయి. ఓఐఎల్ తవ్విన ఒక అన్వేషణాత్మక బావిలో 295 మీటర్ల లోతులో గ్యాస్ ఉన్నట్లు కంపెనీ గుర్తించింది.
ఈ బావి నుంచి సేకరించిన నమూనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ లేబొరేటరీలో పరీక్షించగా, ఇందులో 87 శాతం వరకు మీథేన్ వాయువు ఉన్నట్లు తేలిందని ఓఐఎల్ వెల్లడించింది. అయితే, ఈ బావి నుంచి రోజుకు ఎంత గ్యాస్ వెలికితీయవచ్చనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. నిర్దేశించిన ప్రకారం మొత్తం 2,650 మీటర్ల లోతు వరకు తవ్వకాలు పూర్తి చేస్తేనే ఉత్పత్తి సామర్థ్యంపై ఒక అంచనాకు రాగలమని అధికారులు విశ్లేషిస్తున్నారు.
అండమాన్ దీవులకు సమీపంలో ఉన్న మయన్మార్, ఇండోనేషియా దేశాల సముద్ర తీరాల్లో ఇప్పటికే భారీ స్థాయిలో చమురు, గ్యాస్ నిక్షేపాలు వెలుగుచూసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో అండమాన్, నికోబార్ ప్రాంతంలో కూడా గణనీయమైన హైడ్రోకార్బన్ నిల్వలు ఉంటాయని నిపుణులు చాలాకాలంగా అంచనా వేస్తున్నారు. 'ఇండియా హైడ్రోకార్బన్ రిసోర్స్ అసెస్మెంట్ స్టడీ' నివేదిక ప్రకారం, ఈ ప్రాంతంలో దాదాపు 37.1 కోట్ల టన్నుల చమురుకు సమానమైన నిక్షేపాలు ఉండే అవకాశం ఉంది.
ఈ అంచనాల నేపథ్యంలోనే ప్రభుత్వ రంగ సంస్థలైన ఓఎన్ జీసీ, ఓఐఎల్ కలిసి రూ.3,200 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాంతంలో విస్తృత అన్వేషణ కార్యక్రమాలను చేపట్టాయి. అండమాన్లో చమురు, గ్యాస్ నిక్షేపాలు భారీగా ఉండే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజా ఆవిష్కరణ ఈ అంచనాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.