ఏపీలో న్యాయం, ధర్మం కనుమరుగైంది.. అమరావతి పేరుతో అవినీతి: జగన్ (video)
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం న్యాయం, ధర్మం కనుమరుగైందని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో తప్పుడు కేసులు పెట్టి ప్రజల పరువు ప్రతిష్టలతో ఆడుకుంటున్నారని జగన్ ఆరోపించారు. తప్పుడు వాంగ్మూలాలు, సాక్ష్యాలతో కేసులను నడిపిస్తున్నారని, ప్రలోభాలు పెట్టి లేదా బెదిరించి వాంగ్మూలాలు తీసుకుంటున్నారని జగన్ అన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంగళవారం తాడేపల్లిలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రతినిధుల భేటీ జరిగింది.
ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వ కాలంలో న్యాయవాదుల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టినట్లు జగన్ గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున అవినీతి చేస్తోందన్నారు. లిక్కర్ విక్రయాల్లో విపరీతమైన అవినీతి జరుగుతోందని జగన్ ఆరోపించారు.
గ్రామాల వారీగా బెల్టుషాపులు నడుస్తున్నాయని, ఇల్లీగల్ పర్మిట్ రూముల్లో అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారని పేర్కొన్నారు. జగన్ 2.0 పాలనలో పార్టీ కోసం కృషి చేసే ప్రతీ ఒక్కరికి గుర్తింపు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్రత్యేక డేటాబేస్, మొబైల్ యాప్ రూపొందిస్తున్నట్లు తెలిపారు.