బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీకి భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని కారణంగా రానున్న రెండు రోజుల్లో ఇది పశ్చిమ వాయవ్యదిశగా పయనించే అవకాశం ఉన్నట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి కె.శ్రీనివాస్ తెలిపారు. అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు. రానున్న 24 గంటల్లో అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, జిల్లాలకు అతిభారీ వర్ష సూచన ఉంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు.
అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటలకు 40 నుంచి 50కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. రెండు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.