జగన్ నుంచి బొత్సకు ప్రాణహాని : పల్లా శ్రీనివాస రావు
వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రాణహాని పొంచివుందని టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు సంచలన ఆరోపణలు చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, శాసనమండలిలో బొత్స చేసిన వ్యాఖ్యలు చూస్తే జగన్ నుంచే ఆయకు ప్రాణహాని ఉన్నట్టుగా ఉందనిపిస్తోందని అన్నారు.
పార్టీలో తనను దాటి వెళ్లినా, ఎక్కువ పేరు తెచ్చుకున్నా జగన్ వాళ్లను అంతం చేస్తారనే ఆరోపణలున్నాయని అన్నారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డిని అలాగే అంతమొందించారని అంతా అనుకుంటున్నారని పేర్కొన్నారు.
'ప్రతిపక్ష నేతగా బొత్స బాగా ఫోకస్ అవుతున్నారు. ఆయనకు వైకాపా నుంచే ప్రాణహాని ఉందనిపిస్తోంది. కావాలంటే ప్రభుత్వపరంగా భద్రత కల్పిస్తాం. కూటమి ప్రభుత్వంలో మూడు ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందుతున్నాయి.
రాష్ట్రంలో గూగుల్, టీసీఎస్, మహీంద్ర, లులు, రిలయన్స్ తదితర సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి సీఎం చంద్రబాబు దార్శనికతే కారణం. త్వరలో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కానుంది' అని పల్లా వివరించారు.