గురువారం, 20 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 నవంబరు 2025 (15:00 IST)

సినీ నటి ప్రత్యూష కేసు .. ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వు

pratyusha
తెలుగు రాష్ట్రాల్లో రెండు దశాబ్దాల క్రితం సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో హైకోర్టు విధించిన జైలుశిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డికి విధించిన శిక్షను పెంచాలంటూ ఆమె తల్లి సరోజినీదేవి దాఖలు చేసిన క్రిమినల్ అప్పీళ్లపై జస్టిస్ రాజేశ్ బిందల్, జస్టిస్ మన్మోహన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ పూర్తి చేసి బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. 
 
ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి హైదరాబాద్ నగరంలో ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రేమించుకున్నారు. ఇంటర్ పూర్తయిన అనంతరం ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లగా... సిద్ధార్థరెడ్డి ఇంజినీరింగ్‌ కోర్సులో చేరాడు. 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం 7.30-8 గంటల మధ్య ఇద్దరూ విషం తాగిన పరిస్థితిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ప్రత్యూష 24న చనిపోయారు. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థరెడ్డి డిశ్చార్జి అయ్యాడు. వారు శీతలపానీయంలో పురుగుమందు కలిపి తాగినట్లు పరీక్షల్లో గుర్తించారు. 
 
ఆర్గానోఫాస్ఫేట్ కారణంగా ప్రత్యూష మరణించారని... ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా దర్యాప్తు జరిపిన సీబీఐ... నిందితుడిపై 306 (ఆత్మహత్యకు పురికొల్పడం), 309 (ఆత్మహత్యకు యత్నించడం) సెక్షన్ల కింద ఛార్జిషీట్ దాఖలు చేసింది. నిందితుడు సిద్ధార్థరెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఐదేళ్ల కఠిన కారాగారశిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ 2004 ఫిబ్రవరి 23న తీర్పు చెప్పారు. 
 
అయితే, నిందితుడు సిద్ధార్థ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా... జైలు శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ, జరిమానాను రూ.50 వేలకు పెంచుతూ 2011 డిసెంబరు 28న తీర్పు వెలువరించింది. దీనిపై ప్రత్యూష తల్లి సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు ఆలకించిన ధర్మాసనం... తీర్పును మాత్రం బుధవారం రిజర్వు చేసింది.