దృశ్యం సినిమా చూసి భార్య హత్యకు ప్లాన్ చేసిన భర్త... ఏమీ తెలియనట్టుగా పోలీసులకు ఫిర్యాదు...
పరాయి మహిళతో ఉన్న పెట్టుకున్న అక్రమ సంబంధానికి భార్య అడ్డుగా ఉందని భావించిన ఓ భర్త అతి కిరాతకంగా ప్రవర్తించాడు. హీరో మోహన్ లాల్ నటించిన దృశ్యం సినిమా చూసి కట్టుకున్న భార్యను కడతేర్చాడు. ఆ తర్వాత తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి, కుటుంబ సభ్యులందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, పోలీసులు ఈ కేసును ఛేదించి ఆ కిరాతక భర్తను అరెస్టు చేశారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మహారాష్ట్ర, శివానే ప్రాంతంలో నివసించే సమెర్ పంజాబ్ రావు జాదవ్ (42) ఆటోమొబైల్ గ్యారేజ్ నడుపుతున్నాడు. అతని భార్య అంజలి (38) ఓ ప్రైవేట్ స్కూల్లో టీచరుగా పనిచేస్తున్నారు. సమెర్కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో భార్యను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. భార్యపై తప్పుడు అభిప్రాయం కలిగించేందుకు, స్నేహితుడి ఫోన్ నుంచి ఆమెకు మెసేజ్లు పంపి గొడవలు సృష్టించేవాడు.
అక్టోబరు 26వ తేదీన తన ప్లానును అమలు చేశాడు. భార్యను కారులో డ్రైవ్కు తీసుకెళ్లి, తిరుగు ప్రయాణంలో షిండేవాడిలోని గోగల్వాడి ఫొటా వద్ద తాను అద్దెకు తీసుకున్న గోడౌను తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి భోజనం చేస్తున్న సమయంలో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం సాక్ష్యాలను నాశనం చేసేందుకు, అంజలి మృతదేహాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న ఇనుప పెట్టెలో పెట్టి వంటచెరకుతో నిప్పంటించాడు. పూర్తిగా కాలిపోయిన తర్వాత బూడిదను సమీపంలోని నదిలో పడేశాడు.
'ఈ హత్య కోసం నిందితుడు పక్కా ప్రణాళిక వేశాడు. ఇందుకోసం నెలకు 18,000 అద్దె చెల్లించి గోడౌన్ తీసుకున్నాడు. అక్కడే ఓ పెద్ద ఇనుప పెట్టెను తయారు చేయించి, వంటచెరకును కూడా సిద్ధంగా ఉంచుకున్నాడు' అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శంభాజీ కదమ్ తెలిపారు.
హత్య జరిగిన రెండు రోజుల తర్వాత, 'దృశ్యం' సినిమాలో మాదిరిగానే సమెర్ స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. కేసు విచారణ ఎలా సాగుతోందని తెలుసుకునేందుకు ఆందోళన నటిస్తూ పలుమార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాడు. అయితే అతని ప్రవర్తనపై అనుమానం రావడంతో, పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.