బాలీవుడ్లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?
టాలీవుడ్ మిల్కీబ్యూటీ తమన్నాకు బాలీవుడ్లో బంపర్ ఆఫర్ వరించింది. లెజండరీ దర్శకుడు వి.శాంతారాం బయోపిక్లో ఆమె నటించనున్నట్టు సమాచారం. భారతీయ సినిమా దిగ్గజాల్లో ఒకరుగా వి.శాంతారాం వెలుగొందారు. ఆయన జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మూవీలో శాంతారాం భార్య, అలనాటి ప్రముఖ నటి సంధ్య పాత్రలో తమన్నా కనిపించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి కూడా "చిత్రపతి వి.శాంతారాం" అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. బాలీవుడ్ యువ నటుడు సిద్ధాంత్ చతుర్వేది టైటిల్ రోల్లో నటిస్తుండగా, జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన "నట సామ్రాట్" చిత్ర దర్శకుడు అభిజిత్ దేశ్పాండే ఈ బయోపిక్కు దర్శకత్వం వహించనున్నారు. వి.శాంతారాం దర్శకత్వంలో వచ్చిన అనేక చిత్రాల్లో సంధ్య హీరోయిన్గా నటించారు. హిందీ, మరాఠీ భాషల్లో ఆమెకు మంచి గుర్తింపు ఉన్న నేపథ్యంలో ఈ బయోపిక్ ఆమె పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నారు.
ఈ కథ విన్న వెంటనే తమన్నా పాత్ర చేయడానికి ఎంతో ఆసక్తి చూపి అంగీకరించినట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా విభిన్నమైన కథలను ఎంచుకుంటున్న ఆమె కెరీర్లో ఈ పాత్ర మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది. ఇందులో వి.శాంతారాం సినీ ప్రస్థానం, ఆయన ప్రయోగాలు, వ్యక్తిగత జీవితంలోని కీలక ఘట్టాలను ఈ చిత్రంలో ఆవిష్కరించనున్నారు.