గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు... 22 మంది మృత్యువాత
పాలస్తీనాలోని గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ వైమానిక దళం మరోమారు వైమానిక దాడులకు తెగబడింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్థరాత్రి ఇజ్రాయెల్ వైమానిక దళ గాజా స్ట్రిప్ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసింది. ఈ దాడుల్లో మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయినట్టు గాజా డిఫెన్స్ ఏజెన్సీ అధికారికంగా వెల్లడించింది.
గాజా అధికారులు వెల్లడించిన వివరాల మేరకు.. గాజా నగరంలో 12 మంది, ఖాన్ యూనిస్ ప్రాంతంలో మరో 10 మంది మరణించారు. ఈ మృతుల సంఖ్యను కూడా హమాస్ వర్గాలు కూడా ధృవీకరించాయి.
అయితే, ఈ దాడులపై ఇజ్రాయెల్ మిలిటరీ భిన్నమైన వాదనలు వినిపిస్తోంది. తమ దేశంపై దాడి చేసేందుకు హమాస్ ఉగ్రవాదులు సిద్ధమవుతున్నారన్న పక్కా సమాచారంతోనే ఈ దాడులు చేసినట్టు పేర్కొంది. ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్టు ఇజ్రాయేల్ సైన్యం స్పష్టం చేసింది. ఇరు వర్గాల పరస్పర ఆరోపణల నేపథ్యంలో మరోమారు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.