కాశ్మీర్లో యాక్టివ్ స్లీపర్ సెల్స్ : 48 గంటలు పర్యాటక ప్రాంతాలు మూసివేత
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాద యాక్టివ్ స్లీపర్ సెల్స్ పని చేస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఆ రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను 48 గంటల పాటు మూసివేశారు. కాశ్మీర్ వ్యాప్తంగా 87 పర్యాటక ప్రదేశాల్లో 48 ప్రాంతాలను ప్రభుత్వం మూసివేసింది. ఈ నెల 22వ తేదీన జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో రాబోయే రోజుల్లో భద్రతా దళాలు స్థానికేతర వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు, నిఘా సంస్థల నుంచి ప్రభుత్వానికి సమాచారం అందింది.
స్థానికేతర వ్యక్తులు, సీఐడీ సిబ్బంది, కాశ్మీర్ పండిట్లపై శ్రీనగర్, గుండేర్బల్ జిల్లాల్లో దాడులు చేయాలని పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ప్రణాళికలు రచిస్తున్నట్టు కూడా నిఘా వర్గాలు తెలిపాయి. పహల్గాం దాడి తర్వాత లోయలో ఉగ్రవాదులు ఇళ్లను భద్రతా బలగాలు ధ్వంసం చేసినందుకు ప్రతీకారంగా ఉత్తర, మధ్య, దక్షిణ కాశ్మీర్లో చురుగ్గా ఉన్న ఉగ్రవాదులు మరింత ప్రభావంతమైన దాడికి ప్లాన్ చేస్తున్నట్టు నిఘా వర్గాల నివేదికలు సూచిస్తున్నాయి. అలాగే, రైల్వేలను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగే అవకాశాన్ని కూడా తోసిపుచ్చలేమని నివేదిక హెచ్చరించింది. రైల్వే సెక్యూరిటీ సిబ్బంది బయటకు రాకుండా తమకు కేటాయించిన బ్యారక్లు, క్యాంపుల్లోనే ఉండాలని సూచించింది.