దేశంలోని అన్ని విమానాశ్రయాలకు ఉగ్ర ముప్పు... హైఅలెర్ట్
దేశంలోని అన్ని విమానాశ్రయాలకు ఉగ్రముప్పు పొంచివున్నట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో అన్ని విమానాశ్రయాల వద్ద హై అలెర్ట్ ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ ఉగ్రవాద, సంఘ వ్యతిరేకశక్తులు దాడులకు తెగబడే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో అన్ని విమానాశ్రయాల వద్ద హైఅలెర్ట్ ప్రకటించారు.
ఈ యేడాది సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 2వ తేదీల మధ్య విమానాశ్రయాలపై దాడులు జరిగే అవకాశం ఉందన నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ క్రమంలో కేంద్ర పౌర విమానయాన భద్రతా బ్యూరో అన్ని ఎయిర్ పోర్టులకు అడ్వైజరీ జారీచేసింది. విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది. రన్ వేలు, హెలీప్యాడ్స్, ప్లయింగ్ స్కూల్, ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లలో భద్రత పెంచాలని సూచించింది.
ఈ క్రమంలో విమానాశ్రయాల వద్ద భద్రతా సిబ్బంది అలెర్ట్ అయింది. టెర్మినల్స్, పార్కింగ్ ఏరియా, పెరీమీటర్ జోన్ తదితర సున్నితమైన ప్రాంతాల్లో గస్తీని మరింతగా పెంచాలని పేర్కొంది. దీంతో స్థానిక పోలీసుల సహకారంతో ఎయిర్ పోర్టులకు వెళ్లే మార్గాల్లో తనిఖీలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. విమానాశ్రయ సిబ్బంది, కాంట్రాక్టర్లు, విజిటర్స్ను కూడా తనిఖీ చేయాలని నిర్ణయించారు. అలాగే, ప్రయాణికులకు కూడా అధికారులు పలు సూచనలు చేశారు. అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు కానీ, వస్తువులుకానీ కనిపిస్తే వెంటనే సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాలని ప్రయాణికులకు సూచించారు.