శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారం దుర్వినియోగం - కేరళ సీఎం వివరణ
శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారం దుర్వినియోగం జరుగుతోంది. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారం దుర్వినియోగంపై చెలరేగిన వివాదం తీవ్రరూపం దాల్చింది. ఆలయ నిర్వహణ చూస్తున్న ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కార్యకలాపాలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో కేరళ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీచేసింది.
ఆలయ ద్వారపాలక విగ్రహాల బంగారు తొడుగుల వ్యవహారంలో జరిగిన అవకతవకలపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. ఈ ఘటనలో ఏకంగా నాలుగున్నర కిలోల బంగారం తేడా రావడం తీవ్ర కలకలం రేపుతోంది.
2019లో ఆలయంలోని ద్వారపాలక విగ్రహాల బంగారు తొడుగులకు మెరుగుపెట్టించే బాధ్యతను బెంగళూరుకు చెందిన ఉన్నికృష్ణన్ పొట్టి అనే వ్యక్తికి బోర్డు అప్పగించింది. ఆయన సొంత ఖర్చుతో ఈ పని చేయిస్తానని ముందుకు రావడంతో, 42.8 కిలోల బరువున్న బంగారు పూత పూసిన రాగి తొడుగులను ఆయన సమక్షంలోనే చెన్నైలోని ఓవరాక్షన్కు పంపారు.
అయితే, శబరిమల నుంచి బయలుదేరిన కంటైనర్ 39 రోజుల తర్వాత చెన్నైకి చేరడం మొదటి అనుమానాలకు తావిచ్చింది. తూకం వేయగా, తొడుగుల బరువు 38.25 కిలోలుగానే తేలింది. అంటే, మార్గమధ్యంలోనే దాదాపు 4.5 కిలోల బరువు తగ్గింది.
ఈ 39 రోజుల ప్రయాణంలో కంటైనర్ కొట్టాయంలోని ఓ ప్రైవేటు ఆలయంతో పాటు, ఆంధ్రప్రదేశ్లోని పలు ఆలయాలకు, బెంగళూరులోని అయ్యప్ప ఆలయానికి కూడా వెళ్లినట్లు ఆరోపణలున్నాయి. ప్రముఖ నటుడు జయరాం ఇంట్లో జరిగిన ప్రైవేటు పూజకు కూడా ఈ విగ్రహ తొడుగులను తీసుకెళ్లినట్లు ఆరోపణలు రావడం వివాదాన్ని మరింత రాజేసింది.
ఈ వ్యవహారంపై 2020లో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. సిట్ నివేదికలో బంగారం తేడా ఉన్నట్లు నిర్ధారణ కావడంతో తాజాగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తన వద్ద మిగిలిన ఆలయ బంగారాన్ని తన కుమార్తె పెళ్లికి వాడుకునేందుకు అనుమతివ్వాలని 2019లో ఉన్నికృష్ణన్ పొట్టి స్వయంగా బోర్డుకు ఈ-మెయిల్ పంపడం ఈ కేసులో కీలక మలుపుగా మారింది.